Abhishek Sharma : వరుస డకౌట్లు.. సింగిల్ డిజిట్ స్కోర్లు.. అభిషేక్ శర్మ ఫామ్ పై అనిల్ కుంబ్లే ఆందోళన

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్ బెర్తులు ఖరారైన వేళ టీమిండియా లో ఒకే ఒక్కడి ఫామ్ ఇప్పుడు సెలక్టర్లకు, అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అతడే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ.

Abhishek Sharma : వరుస డకౌట్లు.. సింగిల్ డిజిట్ స్కోర్లు.. అభిషేక్ శర్మ ఫామ్ పై అనిల్ కుంబ్లే ఆందోళన
Anil Kumble

Updated on: Mar 02, 2026 | 7:09 PM

Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. సెమీఫైనల్ బెర్తులు ఖరారైన వేళ టీమిండియాలో ఒకే ఒక్కడి ఫామ్ ఇప్పుడు సెలక్టర్లకు, అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అతడే యువ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఐపీఎల్‌లో పరుగుల వరద పారించి, సిక్సర్ల కింగ్‌గా పేరు తెచ్చుకున్న ఈ కుర్రాడు.. మెగా టోర్నీలో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన సూపర్‌ 8 మ్యాచ్‌లో కూడా అభిషేక్ చేతులెత్తేశాడు. 11 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడం గిల్ సేనలో చర్చకు దారితీసింది.

అభిషేక్ శర్మకు ఈ టోర్నీ ఒక పీడకలలా మారింది. గ్రూప్ స్టేజీలో ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా మూడు సార్లు డకౌట్ (0, 0, 0) అయి చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. కేవలం జింబాబ్వేపై ఒక హాఫ్ సెంచరీ మినహా, మిగిలిన ఆరు మ్యాచుల్లో కలిపి అతడు చేసింది కేవలం 80 పరుగులు మాత్రమే. ఈ గణాంకాలు చూస్తుంటే ఒక ఓపెనర్‌గా అతడు ఏ స్థాయిలో విఫలమయ్యాడో అర్థం చేసుకోవచ్చు. మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్ ముందే అభిషేక్ ఫామ్ లేమి భారత్‌ను టెన్షన్ పెడుతోంది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందిస్తూ.. అభిషేక్‌లో కాన్ఫిడెన్స్ పూర్తిగా దెబ్బతిందని అభిప్రాయపడ్డారు. “అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే అతడిలో ఆత్మవిశ్వాసం లోపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాలే. ముఖ్యంగా ఇంగ్లాండ్ స్పిన్నర్ విల్ జాక్స్ పవర్‌ప్లేలో బౌలింగ్ చేస్తాడు, అతడిని ఎదుర్కోవడం అభిషేక్‌కు కష్టంగా మారవచ్చు. అయితే ఫామ్‌లో లేడనే కారణంతో సెమీస్ వంటి పెద్ద మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టడం సరికాదు” అని కుంబ్లే సూచించారు.

మరోవైపు, సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “వెస్టిండీస్‌పై భారత్ గెలిచింది కాబట్టి అభిషేక్ శర్మ బతికిపోయాడు. ఒకవేళ ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఉంటే, విమర్శకులందరూ అభిషేక్ వైఫల్యాన్నే ఎత్తి చూపేవారు. జట్టు గెలుస్తున్నప్పుడు లోపాలు కనిపించవు. ఆ గెలుపే అతడికి ఇప్పుడు రక్షణ కవచంలా పనిచేస్తోంది. సెమీఫైనల్లో అయినా అతడు తన సహజ సిద్ధమైన ఆట ఆడతాడని కోరుకుంటున్నాను” అని డుప్లెసిస్ పేర్కొన్నారు.

మరోవైపు, భారత్ సెమీస్ చేరదని గతంలో జోస్యం చెప్పిన పాక్ మాజీ పేసర్ మహమ్మద్ ఆమిర్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. భారత్ విజయగీతం పాడుతుంటే, పాక్ మాత్రం ఇంటికి చేరడంతో నెటిజన్లు ఆమిర్ పరువు తీస్తున్నారు. మొత్తం మీద, ముంబైలో జరిగే సెమీఫైనల్ పోరులో అభిషేక్ శర్మ తనను తాను నిరూపించుకుంటాడా లేక తన ఫెయిల్యూర్ సిరీస్‌ను కొనసాగిస్తాడా అనేది చూడాలి. టీమిండియా ఫైనల్ చేరాలంటే ఓపెనింగ్ జోడీ నుంచి మంచి ఆరంభం లభించడం అత్యంత కీలకం.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us