
Abhishek Sharma : టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా ఘనవిజయాలతో దూసుకుపోతున్నా, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. టోర్నీకి ముందు ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్గా, భారత జట్టులో అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా ముద్రపడ్డ అభిషేక్, ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. గత ఆరు టీ20 ఇన్నింగ్స్ల్లో అతను ఏకంగా నాలుగు సార్లు సున్నా (డకౌట్) పరుగులకే వెనుదిరగడం గమనార్హం. ఈ టోర్నీలో అభిషేక్ శర్మ ప్రయాణం ఏమంత సాఫీగా సాగడం లేదు. మొదటి మ్యాచ్లో యూఎస్ఏ పై డకౌట్ అయిన తర్వాత, అతను తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్తో ఢిల్లీలోని ఆసుపత్రిలో రెండు రోజుల పాటు చేరాల్సి వచ్చింది. దీనివల్ల నమీబియాతో జరిగిన మ్యాచ్కు దూరమయ్యాడు. ఆదివారం కొలంబోలో పాకిస్థాన్తో జరిగిన కీలక పోరులో కోలుకుని బరిలోకి దిగినప్పటికీ, కేవలం 4 బంతులే ఆడి మళ్ళీ సున్నాకే అవుట్ అయ్యాడు. దీంతో టీ20 ప్రపంచకప్లో ఆడిన మొదటి రెండు మ్యాచ్ల్లోనూ డకౌట్ అయిన తొలి భారత బ్యాటర్గా అభిషేక్ అన్ వాంటెడ్ రికార్డును మూటగట్టుకున్నాడు.
అభిషేక్ ఫామ్పై విమర్శలు వస్తున్నప్పటికీ, మాజీ కోచ్ రవిశాస్త్రి అతనికి మద్దతుగా నిలిచారు. “అభిషేక్ శర్మ ఒక క్వాలిటీ ప్లేయర్. ఇలాంటి ఫేజ్ ఎవరికైనా వస్తుంది. అతను క్రీజులో కొంచెం సమయం గడిపితే చాలు, మళ్ళీ పాత ఫామ్లోకి వస్తాడు. ఒక్కసారి అతను కుదురుకుంటే బౌండరీల వర్షం కురిపించడం అతనికి పెద్ద కష్టం కాదు” అని శాస్త్రి పేర్కొన్నారు. అభిషేక్ విఫలమైనా, మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (77 పరుగులు) వీరవిహారం చేయడంతో భారత్ పాక్పై 61 పరుగుల భారీ విజయాన్ని సాధించింది.
భారత్ తన తదుపరి లీగ్ మ్యాచ్ను బుధవారం (ఫిబ్రవరి 18) అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్తో ఆడనుంది. సూపర్-8 దశకు ముందు అభిషేక్ శర్మ తన ఫామ్ను తిరిగి పొందేందుకు ఇదొక చక్కని అవకాశం. ఈ మ్యాచ్లో అతను రాణిస్తే టీమిండియాకు ఓపెనింగ్ సమస్య తీరినట్టే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..