Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్ధం.. సోమవారం నుంచి వారం రోజుల పాటు..

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్ధమైంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్ధం.. సోమవారం నుంచి వారం రోజుల పాటు..
Yadadri Temple

Updated on: Mar 20, 2022 | 6:42 PM

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు అంతా సిద్ధమైంది. సోమవారం నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానాలయంలోని గర్భాలయ దర్శనాలకు వారం రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనుల్లో అధికారులు వేగం పెంచారు. మహాకుంభ సంప్రోక్షణ యాగాన్ని ఈ నెల 21వ తేదీ నుంచి 28 వరకు పాంచరాత్రాగమన శాస్త్రపద్ధతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని పునర్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలతో ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు 2016లో చేపట్టారు. చిన్న జీయర్ స్వామితో కలిసి పలుమార్లు పర్యటించి యాదాద్రి ప్రధాన నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అప్పటి నుంచి దాదాపు 70 నెలలుగా లక్ష్మీ నరసింహస్వామి బాలాలయంలో కొలువుదీరారు. ప్రధాన ఆలయ పనులు పూర్తికావడంతో ఆలయ ఉద్ఘాటనకు ప్రభుత్వం ముహూర్తాన్ని ఖారారు చేసింది. ఈ నెల 28వ తేదీన మహా సంప్రోక్షణ నిర్వహిస్తున్నట్టు ఆలయ అధికారులు చెబుతున్నారు.

బాలాలయంలో పంచకుండా ఆత్మత్యాగం సోమవారం నుంచి పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో జరగనున్నాయి. ఈనెల 21వ తేదీన ఉదయం విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యావా వాచన మంత్రాలతో స్వయంభు పంచ నారసింహుడి ప్రధాన ఆలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు శ్రీకారం చుట్టనున్నారు. బాలాలయంలో ఐదు విధాలుగా కుండాలను ఏర్పాటు చేశారు. తూర్పున చతురస్రాకారాంలో, పడమరలో వృత్తాకారంలో, ఉత్తరంలో త్రికోణం, దక్షిణంలో అర్థచంద్రకారం, ఈశాన్యంలో పద్మాకారంలో హోమగుండాల నిర్మాణాలు పూర్తయ్యాయి. హోమగుండాలకు కలశాలను కూడా ఏర్పాటు చేశారు. వెదురుకర్రలతో యాగశాలను నిర్మించారు. ఈ కుండాలలోనే సోమవారం నుంచి 28వరకు రుత్వికులు, అర్చకులు మూలమంత్ర, మూర్తిమంత్రహోమాలు నిర్వహిస్తారు. యాగానికి సంబంధించిన పూలు, ఫలాలు, 24 రకాల ద్రవ్యాలతో పాటు స్వచ్ఛమైన నెయ్యితో యాగం నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకుడు చెబుతున్నారు.

ఆలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ ఈనెల 28వ తేదీ మధ్యాహ్నం 12 .11 గంటలకు మిధున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, సాయంత్రం 6 గంటలకు శాంతి కళ్యాణంతో ముగియనున్నాయి. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధానాలయం సప్తగోపురాలకు మొత్తం 125 కలశాలలను బిగిస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం పక్కన ఉన్న కల్యాణ మండపం, తూర్పు ద్వారానికి ముందు మండపాలకు కూడా స్కఫోల్డింగ్ ఏర్పాటు చేసి కలశాలను బిగించే పనులు కొనసాగుతున్నాయి. ప్రధానాలయంతోపాటు దర్శన క్యూకాంప్లెక్స్‌, పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. విష్ణుపుష్కరిణి చుట్టూ సుందరీకరణ చేశారు. దర్శన క్యూకాంప్లెక్స్‌ భవనానికి పద్మాలు అమర్చారు. లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట పనులు పూర్తయి, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

యాదాద్రి పుణ్యక్షేత్రం ఉద్ఘాటనకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రధానాలయ ముఖ మండపాన్ని విద్యుత్‌ దీపకాంతులతో తీర్చిదిద్దారు. అధునాతన విద్యుత్‌ దీపాలు, ధ్వజస్తంభం, బలిపీటం, గర్భాలయ ముఖ ద్వారం బంగారు వెలుగులు విరజిమ్ముతూ శోభాయమానంగా కనిపిస్తోంది. ప్రధానాలయంలోని ఉపాలయంలో ఆళ్వార్లు, ఆండాల్‌ అమ్మవారు, రామానుజులు విగ్రహ ప్రతిష్ఠాపనకు ఉపాలయాలను సిద్ధం చేశారు. ఈ ఉపాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠాపన యంత్ర ప్రతిష్ఠ చేసేందుకు పాంచరాత్రాగమ శాస్త్ర రీతిలో ఏర్పాట్లకు ప్రధాన అర్చకుడు నల్లన్‌థిఘల్‌ లక్ష్మీనరసింహచార్యుల అర్చక బృందం ఏర్పాటు చేస్తోంది. మహాకుంభ సంప్రోక్షణ, పంచకుండా ఆత్మత్యాగం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు.

Also read:

Health Care Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే వేసవిలో ఈ పండ్లను తినండి..

Viral Video: చిరుతపులి, బ్లాక్ పాంథర్ మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే గుండెలదిరిపోతాయి..!

IOCL Recruitment 2022: ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us