
పుట్టుక నుండి మరణం వరకు మనిషిని వెన్నంటే ఉండేది ఎవరు? తల్లిదండ్రులు, తోబుట్టువులు, స్నేహితులు.. ఇలా ప్రతి బంధం ఒకానొక సమయంలో మనల్ని విడిచి వెళ్లవచ్చు. కానీ మనల్ని విడవకుండా ఉండే ఏకైక సహచరుడు మన నీడ. కేవలం ఎండలో కనిపించే నల్లని ప్రతిబింబంగానే మనం నీడను చూస్తాం.. కానీ దాని వెనుక అపారమైన ఆధ్యాత్మిక రహస్యాలు ఉన్నాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ బసవరాజ్ గురూజీ వివరించారు. మనం చేసే ప్రతి పనికి, మన ఆలోచనలకు మన నీడ ప్రతిరూపం అని బసవరాజ్ గురూజీ తెలిపారు. మన శరీరంలో పాపపుణ్యాల లెక్కలు మారుతున్నప్పుడు నీడ మనల్ని ముందే హెచ్చరిస్తుందట. జీవితంలో ఎదురయ్యే ఊహించని కష్టాలు, జైలు శిక్షలు, అవమానాలు లేదా తీవ్రమైన గండాలకు ముందు నీడ కొన్ని పరోక్ష సూచనలను ఇస్తుంది. అయితే లౌకిక ప్రపంచంలో మునిగి తేలే మనం ఆ సూచనలను గమనించలేమని ఆయన విశ్లేషించారు.
ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం.. మనిషి మరణం చేరువైనప్పుడు శరీరం బలహీనపడటమే కాకుండా మన నీడ కూడా క్రమంగా మనల్ని విడిచిపెడుతుంది. నీడ అదృశ్యం కావడం లేదా వింతగా అనిపించడం శుభప్రదం కాదని అంటారు. మరణ సమయంలో ఈ నల్లని బొమ్మ పంచభూతాలలో కలిసిపోతుంది. దీనినే యమ చిహ్నం అని లేదా శని దేవుని ప్రభావం అని కూడా పిలుస్తారు. ‘‘మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ, మన లెక్కలన్నింటినీ యమధర్మరాజుకు చేరవేసే దూత మన నీడే’’ అని డాక్టర్ బసవరాజ్ గురూజీ చెప్పారు.
మన నీడ మనల్ని మంచి మార్గంలో నడిపించాలంటే మన ప్రవర్తన సానుకూలంగా ఉండాలని గురూజీ సూచిస్తున్నారు.
చివరగా మన ప్రతి అడుగును గమనిస్తున్న మన నీడను గౌరవిస్తూ సన్మార్గంలో నడవడం ద్వారానే జీవితం పరిపూర్ణం అవుతుందని ఈ ఆధ్యాత్మిక విశ్లేషణ సారాంశం.