
Shravan Somwar Markandeya Story Telugu: శ్రావణ మాసంలోని సోమవారాన్ని 2026 ఆగస్టు 24న భక్తులు ఆచరిస్తున్నారు. శ్రావణ మాసంలోని నాలుగు సోమవారాలు శివారాధనకు అత్యంత విశిష్టమైనవిగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, శివలింగానికి అభిషేకం చేసి, బిల్వదళాలతో పూజలు నిర్వహిస్తారు. అలాగే శ్రావణ సోమవారం వ్రత కథను వినడం లేదా చదవడం కూడా సంప్రదాయంగా కొనసాగుతోంది. శివునిపై సంపూర్ణ విశ్వాసంతో చేసే భక్తి ఎలాంటి విపత్కర పరిస్థితినైనా అధిగమించే శక్తిని ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఇందుకు నిదర్శనంగా పురాణాల్లో చెప్పుకునే కథల్లో మార్కండేయ మహర్షి కథ ఒకటి. తన భక్తుడిని మృత్యువు నుంచి కూడా కాపాడిన పరమశివుడి కరుణను ఈ కథ వివరిస్తుంది.
పురాణ గాథ ప్రకారం, మహర్షి మృకండు, ఆయన భార్య సువ్రతకు చాలాకాలం పాటు సంతానం కలగలేదు. సంతానం కోసం వారు పరమశివుడిని ఆరాధిస్తూ కఠోర తపస్సు చేశారు. వారి భక్తికి సంతోషించిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పాడు. అప్పుడు శివుడు వారికి రెండు అవకాశాలను ఇచ్చినట్లు కథనం. సద్గుణాలు అంతగా లేని, కానీ దీర్ఘాయుష్షు కలిగిన కుమారుడు లేదా సకల సద్గుణాలు, జ్ఞానం కలిగి కేవలం 16 సంవత్సరాలు మాత్రమే జీవించే కుమారుడు.. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాలని సూచించాడు.మహర్షి మృకండు సద్గుణసంపన్నుడైన కుమారుడినే కోరుకున్నాడు. అలా వారికి జన్మించిన బాలుడికి మార్కండేయుడు అని పేరు పెట్టారు.
మార్కండేయుడు చిన్ననాటి నుంచే పరమశివునికి గొప్ప భక్తుడిగా పెరిగాడు. శివలింగాన్ని పూజిస్తూ, శివనామస్మరణ చేస్తూ, మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ తన జీవితాన్ని గడిపేవాడు. అయితే తల్లిదండ్రులకు తెలిసినట్లుగానే మార్కండేయుడి ఆయుష్షు 16 సంవత్సరాలకే పరిమితమైంది. అతని 16వ జన్మదినం సమీపించే కొద్దీ తల్లిదండ్రులు తీవ్రంగా ఆందోళన చెందారు. కానీ మార్కండేయుడు మాత్రం శివునిపై తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు.
మార్కండేయుడి ఆయుష్షు పూర్తయ్యే సమయం రాగానే యమధర్మరాజు దూతలు అతని ప్రాణాలను తీసుకెళ్లడానికి వచ్చారు. ఆ సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని, పరమశివుడిని స్మరిస్తూ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తున్నాడు. శివునిపై అతనికున్న అచంచలమైన భక్తి కారణంగా యమదూతలు అతని దగ్గరకు వెళ్లలేకపోయారని పురాణ కథనం. దీంతో యమధర్మరాజే స్వయంగా మార్కండేయుడి ప్రాణాలను తీసేందుకు వచ్చాడు. యముడు తన పాశాన్ని మార్కండేయుడిపై విసరగా, అది బాలుడితో పాటు శివలింగానికీ చుట్టుకుంది.
తన భక్తుడికి ఆపద వచ్చిన విషయం తెలుసుకున్న పరమశివుడు శివలింగం నుంచి ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యాడు. యమధర్మరాజును అడ్డుకుని మార్కండేయుడిని రక్షించాడు. తనను ఆశ్రయించిన భక్తుడిని కాపాడటం కోసం స్వయంగా ప్రత్యక్షమైన శివుడి కరుణకు మార్కండేయుడి భక్తి కారణమైందని ఈ కథ చెబుతుంది. అనంతరం శివుడు మార్కండేయుడికి దీర్ఘాయుష్షును ప్రసాదించి, అతడు చిరంజీవిగా ఉండేలా వరమిచ్చాడని పురాణాల్లో పేర్కొంటారు. ఆ బాలుడే తరువాత మార్కండేయ మహర్షిగా ప్రసిద్ధి చెందాడు.
మార్కండేయుడి కథ భక్తి, విశ్వాసం, శరణాగతికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. కష్టాలు ఎదురైనప్పుడు భయపడకుండా దేవుడిపై సంపూర్ణ విశ్వాసం ఉంచాలని ఈ కథ సందేశాన్ని ఇస్తుంది. అందుకే శ్రావణ సోమవారాల్లో శివారాధన, అభిషేకం, ఉపవాసంతో పాటు వ్రత కథను చదవడం లేదా వినడం కూడా భక్తులు పవిత్రమైన ఆచారంగా భావిస్తారు. పరమశివుడిపై అచంచలమైన భక్తి ఉంటే ఆయన కరుణ తప్పక లభిస్తుందనే విశ్వాసాన్ని మార్కండేయుడి గాథ గుర్తుచేస్తుంది.
(Disclaimer: ఈ కథనం పురాణాలు, హిందూ మత విశ్వాసాలు, సంప్రదాయాల ఆధారంగా అందించబడింది. ఇందులో పేర్కొన్న విషయాలను ఆధ్యాత్మిక విశ్వాసాలుగానే పరిగణించాలి.)