
త్రయోదశి శివుడికి ప్రీతిపాత్రమైన తిథి కాగా, శనివారం విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు. ఈ రెండు కలిసిన శని త్రయోదశి నాడు శివ-కేశవుల అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాకుండా, శని దేవుడు జన్మించిన తిథి కూడా త్రయోదశి కావడంతో ఈ రోజుకు మరింత పవిత్రత చేకూరింది. ఈ పర్వదినం నాడు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. మరి ఈ ఏడాది తిథి సమయాలు పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శని త్రయోదశి తిథి సమయాలు (జనవరి 2026):
త్రయోదశి ప్రారంభం: జనవరి 30, శుక్రవారం ఉదయం 11:09 గంటలకు.
త్రయోదశి ముగింపు: జనవరి 31, శనివారం ఉదయం 8:26 గంటలకు.
ఉదయ తిథి ప్రకారం: జనవరి 31 శనివారం రోజే శని త్రయోదశి పూజలు నిర్వహించుకోవాలి.
ఈ రోజున పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు:
అభిషేకం: సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి.
రావి చెట్టు ప్రదక్షిణ: శనివారం నాడు లక్ష్మీనారాయణులు రావి చెట్టు (అశ్వత్థ వృక్షం)పై ఉంటారని నమ్మకం. ఈ రోజు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల పీడలు తొలగిపోతాయి.
దాన ధర్మాలు: నల్లని వస్త్రం, నల్ల నువ్వులు, నువ్వుల నూనె లేదా ఇనుప వస్తువులను పేదలకు దానం చేయడం వల్ల శని దోష ప్రభావం తగ్గుతుంది.
ముఖ్యమైన హెచ్చరిక: శని ఆలయం నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చూస్తే శని దోషం మళ్ళీ చుట్టుకుంటుందని పురాణాలు చెబుతున్నాయి.
కాకికి నైవేద్యం: శని వాహనమైన కాకికి అన్నం లేదా నైవేద్యం పెట్టడం వల్ల పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి.
చదవాల్సిన శ్లోకం:
“నీలాంజన సమాభాసం.. రవి పుత్రం యమాగ్రజమ్| ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్||”
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ప్రాంతం మరియు పంచాంగం ప్రకారం పూజా సమయాలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.