Telugu News Spiritual Pydithalli ammavari sirimanotsavam 2024 grand scale held in Vizianagaram
Sirimanotsavam: అంబరాన్ని తాకుతున్న సిరిమాను సంబరాలు.. అమ్మవారికి పట్టుపస్త్రాలు సమర్పించిన మంత్రి కొండపల్లి
పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతరంటే ఉత్తరాంధ్రవాసులకి ఎంతో సంబరం. జీవితంలో ఒక్కసారైనా ఆ జాతరను చూసి తరించాలని తపిస్తుంటారు. నలబై రోజుల పాటు సాగే పండుగలో అతిముఖ్యమైన ఘట్టం సిరిమాను ఉత్సవం. ఏడాదిలో ఒకసారి దసరా పండుగ తర్వాత వచ్చే మంగళవారం రోజు అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ జాతరను కళ్లార చూసేందుకు పక్కరాష్ట్రాల నుంచి భక్తజనం తరలివచ్చారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులు తీరారు. సాయంత్రం మూడు గంటలకు సిరిమాను రథోత్సవం ప్రారంభమైంది. అమ్మవారి పరివారంగా పిలిచే జాలరి వల, అంజలి రథం, పాలధార రథాలు సిరిమాను వెంట నడిచాయి. ఈ క్రమంలో పైడితల్లి ఆలయం నుంచి కోట వరకు మూడు సార్లు పర్యటించారు.
పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమాను ఉత్సవమే కీలకం. ఈ పండుగలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి సిరిమానును ఆలయ ప్రధాన పూజారి సిరిమానును అధిరోహించి భక్తులకు అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిచ్చారు. సిరిమానుకు ముందు తెల్ల ఏనుగు, అంజరి రథాలు సంప్రదాయబద్దంగా ఉరేగాయి.
ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టుపస్త్రాలు సమర్పించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ అవకాశాన్ని కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారాయన. మరోవైపు ఉత్సవాలను మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు కుటుంబంతో పాటు ఎంపీ భరత్, ఎమ్మెల్యే రఘురామ వీక్షించారు.
జీవితంలో ఒక్కసారైనా పైడితల్లి అమ్మవారి జాతరను కళ్లార చూస్తే సిరి సంపదలకు లోటు ఉండదని భక్తుల విశ్వాసం. అలాగే గౌరవ ప్రతిష్టలు, పదవీ యోగాలు కలుగుతాయని బలంగా నమ్ముతారు. ఈ కారణంగానే ఈ జాతర కనీవినీ ఎరుగని రీతిలో వైభవంగా జరుగుతుంది.
అమ్మా పైడిమాంబ.. జై జై పైడితల్లి.. ఎవరి నోటా విన్నా అదే స్మరణ. పెదతాడివాడ నుంచి విజయనగరం వరకు సిరిమాను తీసుకొచ్చే దారులన్నీ భక్తజన జాతరే. ఈ జాతరతో భక్తకోటి పులకించిపోయింది. లక్షలాది మంది భక్తుల రాకతో.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది చంద్రబాబు ప్రభుత్వం.