
Padmini Ekadashi 2026: తెలుగు సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన ఏకాదశుల్లో పద్మిని ఏకాదశి ఒకటి. ఇది సాధారణంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధిక మాసంలో శుక్ల పక్షంలో వస్తుంది. ఈ పవిత్ర ఏకాదశిని కమల ఏకాదశి, పురుషోత్తమ ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజు ఉపవాసం, పూజలు చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈసారి అధిక జ్యేష్ఠ మాసంలో పద్మిని ఏకాదశి మే 27న వచ్చింది. భక్తులు ఈ రోజును ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు వచ్చినా, అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. అందుకే ఈ ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశిగా కూడా భావిస్తారు.
పాప పరిహారం కలుగుతుందని, ఆధ్యాత్మిక శాంతి లభిస్తుందని, సంతాన, ఐశ్వర్య, విజయ ప్రాప్తి జరుగుతుందని విశ్వాసం.
శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు అని భావిస్తారు. అందుకే: తులసి దళాలు, పసుపు రంగు పూలు, కలువ పూలతో స్వామిని అలంకరించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయడం శుభఫలితాలను ఇస్తుంది.
విష్ణు సహస్రనామం, అష్టోత్తర శతనామావళి, విష్ణు స్తోత్రాలు పఠించడం మంచిదిగా భావిస్తారు.
చక్రపొంగలి, అరటిపండ్లు, కొబ్బరికాయ వంటి ప్రసాదాలను సమర్పించి హారతి ఇవ్వాలి.
సాయంత్రం సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి తులసి మాలను సమర్పించడం ఎంతో శుభప్రదం. రాత్రివేళ భజనలు, కీర్తనలతో జాగరణ చేయడం వ్రతానికి మరింత పుణ్యఫలం ఇస్తుందని నమ్మకం.
పురాణాల ప్రకారం త్రేతాయుగంలో ఒక రాజుకు సంతానం లేక తీవ్ర ఆవేదన ఉండేది. అనసూయాదేవి సూచన మేరకు రాణి పద్మిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించింది. ఆమె భక్తికి ప్రసన్నమైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరం ప్రసాదించాడని కథనం చెబుతుంది. తర్వాత రాణికి జన్మించిన కుమారుడే మహాపరాక్రమశాలి కార్తవీర్యార్జునుడిగా ప్రసిద్ధి పొందాడని పురాణాల్లో పేర్కొంటారు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)