
పౌరాణిక గాథ ప్రకారం, భద్రావతి నగరాన్ని ద్యుతిమాన్ అనే రాజు పరిపాలించేవాడు. అదే నగరంలో ధనపాల్ అనే దైవభక్తి గల వైశ్యుడు నివసించేవాడు. అతనికి ఐదుగురు కుమారులు ఉండగా, చిన్నవాడైన ధృష్టబుద్ధి చెడు సావాసాలకు అలవాటు పడి మాంసం, మద్యం జూదం వంటి పాపపు పనుల్లో మునిగిపోయాడు. తండ్రి ఆస్తిని దుర్వినియోగం చేస్తూ, పెద్దలను అగౌరవపరిచేవాడు. విసిగిపోయిన ధనపాల్ తన కుమారుడిని ఇంటి నుండి వెళ్లగొట్టాడు. తిండి కోసం దొంగతనాలు చేస్తూ చివరకు పట్టుబడి, రాజ్యం నుండి కూడా బహిష్కరణకు గురవుతాడు. అడవుల్లో ఆకలి దప్పికలతో అలమటిస్తూ చివరకు కౌడిన్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు.
కౌడిన్య మహర్షి ఉపదేశం
దుస్థితిలో ఉన్న ధృష్టబుద్ధిపై స్నానం చేసి వస్తున్న కౌడిన్య మహర్షి శరీరం నుండి కొన్ని నీటి బిందువులు పడ్డాయి. ఆ స్పర్శతో అతనిలో పశ్చాత్తాపం కలిగింది. మహర్షి పాదాలపై పడి తన పాపాలను క్షమించి, విముక్తి మార్గాన్ని చూపమని ప్రార్థించాడు. అప్పుడు కౌడిన్య మహర్షి, “వైశాఖ శుక్ల ఏకాదశి నాడు వచ్చే మోహిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరించు. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీహరిని ఆరాధిస్తే నీ పాపాలన్నీ భస్మమైపోతాయి” అని ఉపదేశించారు. మహర్షి చెప్పిన విధంగానే ధృష్టబుద్ధి ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో పాటించాడు.
వైకుంఠ ప్రాప్తి..
ధృష్టబుద్ధి నిష్కల్మషమైన భక్తితో చేసిన ఉపవాసానికి విష్ణుమూర్తి అనుగ్రహం లభించింది. ఏకాదశి వ్రత ప్రభావంతో అతని పాపాలన్నీ తొలగిపోయి, మనసు నిర్మలమైంది. తన జీవిత చరమాంకంలో ధృష్టబుద్ధి దివ్య విమానంలో వైకుంఠానికి చేరుకున్నాడు. మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల కలిగే పుణ్యం వెయ్యి గోదానాలు చేసిన ఫలితం కంటే ఎక్కువని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ వ్రత కథను చదివినా లేదా విన్నా కూడా అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. 2026 ఏప్రిల్ 27న ఉదయం నుండి ఉపవాసం ఉండి, ఏప్రిల్ 28 ఉదయం 5:43 గంటలకు పారణ (వ్రత విరమణ) చేయడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఎంతటి పాపాత్ముడైనా పశ్చాత్తాపంతో మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే హరి అనుగ్రహం లభిస్తుందని ధృష్టబుద్ధి కథ మనకు నిరూపిస్తోంది. ఈ పవిత్ర దినాన శ్రీహరిని స్మరించి మోక్ష మార్గంలో పయనిద్దాం.
గమనిక: ఈ సమాచారం పురాణాలు పంచాంగ గణాంకాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం భక్తుల అవగాహన కోసం మాత్రమే. ఉపవాసం చేసే వారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఏకాదశి రోజున అన్నం విసర్జించడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం అత్యంత శుభప్రదం. ఆధ్యాత్మిక విషయాలలో సందేహాలు ఉంటే ధర్మశాస్త్ర పండితులను సంప్రదించడం శ్రేయస్కరం.