
మార్చి 3, 2026న ఆకాశంలో ఒక అరుదైన, అద్భుతమైన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ ఖగోళ సంఘటనను ‘Blood Moon’ అని కూడా పిలుస్తారు. ఇది ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా, శాస్త్రీయంగా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. చంద్రగ్రహణం అంటే సూర్యుడు, చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు, భూమి నీడ చంద్రుడిపై పడటం. సాధారణంగా చంద్రుడు పూర్తిగా చీకటిగా మారాలి. అయితే, భూమి వాతావరణం అంచుల గుండా వెళ్ళే సూర్యకాంతి వంగి, అందులోని ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుకుంటుంది. దీనివల్ల ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా, రాగి పాత్రలా మెరుస్తూ కనిపిస్తాడు. అందుకే దీనిని రక్తచంద్రుడు లేదా బ్లడ్ మూన్ అని వ్యవహరిస్తారు.
మన సనాతన పురాణాల ప్రకారం, గ్రహణాలకు కారణం రాహు-కేతువులు. ఒకానొకప్పుడు దేవతలు, రాక్షసులు అమరత్వం కోసం పాలసముద్రాన్ని చిలికారు. అప్పుడు వెలువడిన అమృతాన్ని శ్రీమహావిష్ణువు జగన్మోహిని అవతారంలో దేవతలకు మాత్రమే పంచడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో స్వర్భానుడు అనే రాక్షసుడు దేవతా రూపం ధరించి దేవతల మధ్య కూర్చుని అమృతం తాగేశాడు. సూర్యచంద్రులు ఈ మోసాన్ని పసిగట్టి విష్ణుమూర్తికి తెలిపారు. ఆగ్రహించిన శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి స్వర్భానుడి తలను మొండెం నుండి వేరుచేశాడు. కానీ అప్పటికే అమృతం గొంతు దాకా వెళ్ళడంతో, ఆ శిరస్సు రాహువుగా, మొండెం కేతువుగా మారాయి. తమను పట్టించిన సూర్యచంద్రులపై పగతో, ఈ రెండు గ్రహాలు వారిని కబళించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి, అవే సూర్య, చంద్ర గ్రహణాలుగా మనకు కనిపిస్తాయి.
గ్రహణ సమయంలో వెలువడే తీవ్ర శక్తుల నుంచి రక్షణ కోసం పూర్వీకులు కొన్ని ఆచారాలను సూచించారు. గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండటం, గ్రహణానికి ముందు, తర్వాత స్నానం చేయటం, ఇష్టదైవ మంత్రాలను జపించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. గ్రహణం ముగిసాక దానధర్మాలు చేయడం ద్వారా కర్మ ఫలాలు శుద్ధి అవుతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే భగవన్నామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలన్నీ మూసివేస్తారు. కానీ అరుణాచలం, శ్రీకాళహస్తి వంటి ప్రసిద్ధ శివాలయాలు తెరిచే ఉంటాయి. అక్కడి శివలింగాలు స్వయంభూవులు కావడం, అవి నవగ్రహాలను తమ ఆధీనంలో ఉంచుకోవడం దీనికి కారణం. ఆ దైవిక శక్తి ఈ క్షేత్రాలను గ్రహణ ప్రభావం నుంచి రక్షిస్తుందని నమ్మకం. ఈ విశ్వశక్తి మార్పులను భయంతో కాకుండా ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక అవకాశంగా స్వీకరించాలని సూచించబడింది. నిత్య శాంతి కోసం “ఓం నమో భగవతే వాసుదేవాయ” లేదా శ్రీ రుద్రం మంత్రాన్ని జపించడం మంచిది.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని సంస్థ ధృవీకరించదు.)