Srisailam temple: శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహణ.. దీని వెనుక ఆంతర్యం ఏంటంటే..?

శ్రీశైలం ఆలయంలో కామదహనం వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతోపాటు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కామదహన కార్యక్రమాన్ని వీక్షించడం వలన శివకటాక్షం లభిస్తుందని ప్రతీతి. ఇంతకీ.. శ్రీశైలం ఆలయంలో నిర్వహించిన కామదహనం స్పెషల్‌ ఏంటి? తెలుసుకుందాం పదండి...

Srisailam temple: శ్రీశైలంలో శాస్త్రోక్తంగా కామదహనం నిర్వహణ.. దీని వెనుక ఆంతర్యం ఏంటంటే..?
Kamadahana

Edited By: Ram Naramaneni

Updated on: Mar 13, 2025 | 10:44 AM

నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఫాల్గుణ శుద్ధ చతుర్ధశిని పురస్కరించుకుని కామదహన కార్యక్రమాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే.. శ్రీగిరులపై కామదహనం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ముందుగా.. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆ తర్వాత ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రాంగణంలోని మనోహరగుండం దగ్గర విశేష పూజలు చేశారు. కర్పూర హారతులు ఇచ్చి.. ఉత్సవ మూర్తులను పల్లకీలో ఊరేగిస్తూ గంగాధర మండపం వరకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే… శ్రీశైలం ఆలయం ఎదురుగా గల గంగాధర మండపం దగ్గర శాస్త్రోక్తకంగా గడ్డితో చేసిన మన్మథ రూపాన్ని దహనం చేశారు. ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులతోపాటు స్థానికులు భారీగా తరలివచ్చారు. కామదహనాన్ని కనులారా వీక్షించారు.

గడ్డితో తయారు చేసిన మన్మధ రూపాన్ని దహించే ఘట్టాన్ని తిలకించిన భక్తులు.. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కామదహనం కార్యక్రమం తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు ఆలయ అధికారులు. ఇక.. ఫాల్గుణ మాసంలో శుద్ధ చతుర్ధశి రోజున జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శివకటాక్షం లభిస్తుందన్నారు శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు. మన్మధుడు శివుడి తపస్సును భగ్నం చేయగా.. ఆగ్రహించిన పరమేశ్వరుడు.. ఫాల్గుణ చతుర్థశి రోజునే మన్మధుడిని దహించినట్లు పురాణాలు చెబుతున్నాయని వేదపండితులు తెలిపారు. ఈ కారణంగానే కామదహన కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం సాంప్రదాయంగా నిర్వహిస్తోందని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..