దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!

Devshayani Ekadashi donations: ఆషాఢ శుక్ల ఏకాదశి సందర్భంగా జూలై 25న దేవశయని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని విశ్వాసం. ధాన్యాలు, నీరు, వస్త్రాలు, పసుపు వస్తువులు, గోసేవ వంటి దానాలు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో ఐశ్వర్యం, సుఖసంతోషాలు, పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం!
Devshayani Ekadashi Donations

Updated on: Jul 24, 2026 | 2:34 PM

Devshayani Ekadashi 2026 Telugu: ప్రతి సంవత్సరం ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున దేవశయని ఏకాదశి(తొలి ఏకాదశి)ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం, 2026లో దేవశయని ఏకాదశి జూలై 25న వస్తోంది. హిందూ సంప్రదాయంలో అన్ని ఏకాదశులలో ఈ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో నాలుగు నెలల పాటు కొనసాగే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. చాతుర్మాసం జూలై 25 నుంచి నవంబర్ 20 వరకు కొనసాగుతుంది. కార్తీక శుక్ల ఏకాదశి రోజున వచ్చే దేవోత్థాన (ప్రబోధిని) ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటారని విశ్వాసం. ఈ నాలుగు నెలలు ఆధ్యాత్మిక సాధన, ఉపవాసం, జపం, దానధర్మాలకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. దేవశయని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించడం వల్ల పాపాలు తొలగి, మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఈ రోజున చేసిన దానధర్మాలకు విశేష పుణ్యఫలితం లభిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి.

దేవశయని ఏకాదశి రోజున దానం చేయాల్సిన వస్తువులు

1. ధాన్యాల దానం

గోధుమలు, బియ్యం, పప్పుధాన్యాలు వంటి ఆహార పదార్థాలను పేదలకు లేదా అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. అన్నదానం మహాదానంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ రోజున ధాన్యదానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

2. నీటి దానం

దాహంతో ఉన్నవారికి తాగునీరు అందించడం లేదా త్రాగునీటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం అత్యంత పుణ్యకార్యంగా పరిగణిస్తారు. సనాతన ధర్మంలో జలదానం గొప్ప సేవగా చెప్పబడింది.

ఇవి కూడా చదవండి

3. కాలానుగుణ పండ్లు, కొత్త వస్త్రాల దానం

కాలానికి తగిన పండ్లు, అలాగే కొత్త వస్త్రాలను దానం చేయడం మంచిదిగా భావిస్తారు. ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలను దానం చేస్తే శ్రీహరి కృప లభిస్తుందని నమ్మకం. ఇది కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం పెరగడానికి దోహదపడుతుందని విశ్వాసం.

4. పసుపు రంగు వస్తువులు, పాదరక్షలు

పసుపు, చందనం, కుంకుమ, పసుపు పూలు వంటి మంగళకరమైన వస్తువులతో పాటు పేదలకు పాదరక్షలను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఇవి విష్ణుమూర్తికి ప్రీతికరమైన దానాలుగా పేర్కొంటారు.

5. గోసేవ, తులసి, ధార్మిక గ్రంథాల దానం

దేవశయని ఏకాదశి రోజున గోవులకు ఆహారం పెట్టడం, గోసేవ చేయడం విశేష పుణ్యఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. అలాగే తులసి మొక్కలు, మట్టి కుండలు, ధార్మిక గ్రంథాలను దానం చేయడం కూడా శ్రేయస్కరంగా భావిస్తారు.

ఆధ్యాత్మిక విశ్వాసం

దేవశయని ఏకాదశి రోజున భక్తితో ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, తులసీదళాలతో శ్రీమహావిష్ణువును ఆరాధించడం, దానధర్మాలు చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహం లభించి, జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని హిందూ మత విశ్వాసం.

(Disclaimer: ఇక్కడ అందించిన వివరాలు పురాణాలు, శాస్త్రాలు, సాంప్రదాయ హిందూ మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని విశ్వాసపరమైన సమాచారంగా మాత్రమే పరిగణించాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Loading...
Unable to load recommendations.
Follow Us