
తిరుమల శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై టీటీడీ భక్తులను అప్రమత్తం చేసింది. నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా భక్తులను ఆకర్షించి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలపై టీటీడీకి పలు ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో దర్శనం, సేవలు, వసతి బుకింగ్లను అధికారిక మార్గాల్లోనే చేసుకోవాలని భక్తులకు సూచించింది.
టీటీడీ పేరుతో నకిలీ బుకింగ్లు
కొంతమంది మోసగాళ్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్మార్క్లను ఉపయోగిస్తూ నకిలీ డిజిటల్ ప్లాట్ఫామ్లను నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి బుకింగ్లు ఇప్పిస్తామంటూ భక్తులను నమ్మించి నగదు వసూలు చేస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా వాట్సాప్లో వచ్చే అనధికారిక బుకింగ్ మెసేజ్లు, లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. సోషల్ మీడియా పేజీలు, ఇతర వ్యక్తుల ద్వారా వచ్చే బుకింగ్ ఆఫర్లను నమ్మి డబ్బులు పంపవద్దని స్పష్టం చేసింది.
259 ఫేక్ వెబ్సైట్లు తొలగింపు
నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలపై టీటీడీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్ పోలీస్ విభాగాల సమన్వయంతో నకిలీ డిజిటల్ ప్లాట్ఫామ్లను గుర్తించి తొలగించడం, బ్లాక్ చేయించడం, బాధ్యులపై దర్యాప్తు చేపట్టడం జరుగుతోందని వెల్లడించింది. గత రెండేళ్లలో 259 నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించినట్లు టీటీడీ తెలిపింది. వీటికి సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదు చేసినట్లు పేర్కొంది.
అధికారిక మార్గాల్లోనే బుకింగ్
భక్తులు శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్లను అధికారిక టీటీడీ వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తున్న వెబ్సైట్, సోషల్ మీడియా ఖాతా నిజమైనదో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలని సూచించింది. టీటీడీ మేధో సంపత్తి, పేరు, లోగోలను దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్మార్క్, సైబర్ చట్టాల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
భక్తులు తెలియని వ్యక్తులకు బుకింగ్ పేరుతో డబ్బులు పంపకుండా, వాట్సాప్లో వచ్చే అనుమానాస్పద లింకులను నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని సైబర్ మోసాల బారిన పడకుండా చూసుకోవాలని సూచించింది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..