
హిందూ సంప్రదాయంలో తల్లిదండ్రుల అంతిమ సంస్కారాలు కేవలం కొడుకులు మాత్రమే నిర్వహించాలనే బలమైన నమ్మకం సమాజంలో ఉంది. కూతుళ్లు ఉన్నప్పటికీ.. పురుషులకే ఈ బాధ్యతను అప్పగించడం మనం తరచుగా చూస్తుంటాం. అయితే మరణం, మరణానంతర జీవితం గురించి సమగ్రంగా వివరించే గరుడ పురాణం ఈ విషయంలో భిన్నమైన వాస్తవాలను వెల్లడిస్తోంది.
గరుడ పురాణంలోని ప్రేత ఖండంలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరికి అర్హత ఉందనే అంశంపై గరుత్మంతుడు అడిగిన ప్రశ్నకు శ్రీమహావిష్ణువు స్పష్టమైన సమాధానమిచ్చాడు. పురుష సంతానానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ.. వారు లేని పక్షంలో స్త్రీలు ఆ బాధ్యతను స్వీకరించవచ్చని భగవంతుడు స్వయంగా సెలవిచ్చాడు. ‘‘ పురుషులు లేనప్పుడు.. భార్య, కూతురు లేదా సోదరి అంత్యక్రియల బాధ్యతను తీసుకోవాలి. ఒకవేళ ఎవరూ లేకపోతే ప్రభుత్వం ఆ వేడుకలను నిర్వహించవచ్చు’’ అని వివరించారు. దీనిని బట్టి స్త్రీలు అంత్యక్రియల్లో పాల్గొనకూడదనేది కేవలం కాలక్రమేణా ఏర్పడిన సామాజిక కట్టుబాటు మాత్రమే తప్ప, శాస్త్రపరమైన నిషేధం కాదని స్పష్టమవుతోంది.
గరుడ పురాణం ప్రకారం.. దహన సంస్కారాలు కేవలం శరీరాన్ని కాల్చడం మాత్రమే కాదు అది ఆత్మ యొక్క ప్రయాణం. ఈ ప్రక్రియలో ఆరు ముఖ్యమైన ప్రదేశాలలో ఆచారాలు నిర్వహించాలి.
ఈ క్రమంలో ఆత్మ శవం నుండి ప్రేతరూపంలోకి మారుతుంది.
మరణించిన తర్వాత 10 రోజుల పాటు ఇచ్చే పిండాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రతిరోజూ ఇచ్చే పిండం ఆత్మకు ఒక అవయవాన్ని సమకూర్చుతుందని, 10వ రోజున పూర్తి శరీరం ఏర్పడి ఆత్మ పితృలోకానికి లేదా పునర్జన్మ వైపు ప్రయాణిస్తుందని పురాణం చెబుతోంది. ఈ ఆచారాలు సరిగ్గా నిర్వహించకపోతే ఆత్మ దెయ్యం గానే మిగిలిపోతుందని హెచ్చరిస్తోంది.
నేటి కాలంలో చాలామందికి ఒకరే కూతురు ఉండటం లేదా కూతుళ్లే తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవడం మనం చూస్తున్నాం. అటువంటప్పుడు పురాతన శాస్త్రాలు కల్పించిన వెసులుబాటును ఉపయోగించుకోవడం సముచితం. స్త్రీలు అంత్యక్రియలు నిర్వహించడం వల్ల ఆధ్యాత్మిక సమగ్రత దెబ్బతినకపోగా.. అది వారికి తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను, గౌరవాన్ని చాటుతుంది.