పార్లమెంటులో ‘ కర్ణాటక ప్రతిధ్వని ‘
కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటును తాకింది. ఆ రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు బీజేపీ కుట్రకు పాల్పడుతోందంటూ లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తెర చాటున కమలం పార్టీ ఇందుకు కుయుక్తులు పన్నుతోందని వారు ఆరోపించారు. ముంబై లోని ఓ హోటల్లో తమ పార్టీ సభ్యులను బస చేయించడం వెనుక, బీజేపీకి చెందిన ఓ ఎంపీ ఆధ్వర్యంలోని సంస్థ నిర్వహిస్తున్న విమానంలో వారిని ముంబైకి తరలించడం వెనుక ఆ పార్టీ పన్నిన […]
కర్ణాటక రాజకీయ సంక్షోభం పార్లమెంటును తాకింది. ఆ రాష్ట్రంలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కుప్ప కూల్చేందుకు బీజేపీ కుట్రకు పాల్పడుతోందంటూ లోక్ సభలో కాంగ్రెస్ సభ్యులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. తెర చాటున కమలం పార్టీ ఇందుకు కుయుక్తులు పన్నుతోందని వారు ఆరోపించారు. ముంబై లోని ఓ హోటల్లో తమ పార్టీ సభ్యులను బస చేయించడం వెనుక, బీజేపీకి చెందిన ఓ ఎంపీ ఆధ్వర్యంలోని సంస్థ నిర్వహిస్తున్న విమానంలో వారిని ముంబైకి తరలించడం వెనుక ఆ పార్టీ పన్నిన పన్నాగం వెల్లడవుతోందని వారు అన్నారు. అయితే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఆరోపణలను ఖండించారు. కర్ణాటక రాజకీయ సంక్షోభానికి, తమ పార్టీకి సంబంధం లేదన్నారు.ఎమ్మెల్యేలను తరలించిన విమానం ప్రయివేటు జెట్ విమానమని, ఇతరులకు కూడా ఈ విమాన సర్వీసులు అందుతున్నాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా…. హోం మంత్రి అమిత్ షా నేతృత్వాన ఈ వ్యవహారమంతా సాగుతోందని కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య బెంగుళూరులో ఆరోపించారు. తమకు 120 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని… వీరు రాజీనామాలు చేసినా పార్టీ చెక్కు చెదరకుండా ఉందన్నారు. ప్రలోభాలకు తమ పార్టీ సభ్యులు లొంగడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే కుమారస్వామి ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్నామో, లేదో స్పష్టంగా చెప్పడానికి సిధ్ధరామయ్య నిరాకరించారు. ప్రభుత్వానికి వచ్చిన ఢోకా మాత్రం ఏమీ లేదని ఆదివారం చేసిన వ్యాఖ్యలనే ఆయన పునరుద్ఘాటించారు. ..