కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ-ఎస్ పొత్తు ఖతం ?

|

Aug 24, 2019 | 12:38 PM

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ-ఎస్ మధ్య పొత్తు క్రమేపీ ‘ బీటలు వారుతోంది ‘. ఈ అలయెన్స్ కు గండం తలెత్తింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వఛ్చిన 14 నెలల్లోనే అది కుప్పకూలడానికి మీరంటే మీరే కారణమని ఈ రెండు పార్టీల నాయకులూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం ప్రారంభించారు. తాజాగా.. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య… జేడీ-ఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడను, ఆయన కుమారులను దుయ్యబట్టారు. పాలనా వ్యవహారాల్లో వారు ఎమ్మెల్యేలను విశ్వాసం […]

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ-ఎస్ పొత్తు ఖతం ?
Follow us on

కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ-ఎస్ మధ్య పొత్తు క్రమేపీ ‘ బీటలు వారుతోంది ‘. ఈ అలయెన్స్ కు గండం తలెత్తింది. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వఛ్చిన 14 నెలల్లోనే అది కుప్పకూలడానికి మీరంటే మీరే కారణమని ఈ రెండు పార్టీల నాయకులూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం ప్రారంభించారు. తాజాగా.. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్దరామయ్య… జేడీ-ఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడను, ఆయన కుమారులను దుయ్యబట్టారు. పాలనా వ్యవహారాల్లో వారు ఎమ్మెల్యేలను విశ్వాసం లోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. ‘ సంకీర్ణ ప్రభుత్వం పడిపోవడానికి దేవెగౌడ, కుమారస్వామి, రేవన్న అసలైన కారకులు. ఎమ్మెల్యేలంతా ఇదే మాట చెబుతున్నారు. కాంగ్రెస్, జేడీ-ఎస్ శాసన సభ్యులను విశ్వాసంలోకి తీసుకుని, వారి సొంత నియోజకవర్గాల్లో అభివృధ్ది పనులు జరిగేలా చూసి ఉంటే అసలు అసమ్మతే తలెత్తి ఉండేది కాదు ‘ అని ఆయన అన్నారు.

2018 మే నెలలో కాంగ్రెస్ పార్టీ తనపట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా సిద్దరామయ్య సంకీర్ణ ప్రభుత్వ మనుగడను దెబ్బ తీశారని దేవెగౌడ విమర్శించిన సంగతి తెలిసిందే.. అయితే ఈ వ్యాఖ్యలను సిద్దరామయ్య ఖండించారు. తన ప్రత్యర్థి అయిన కుమారస్వామి సీఎం కావడం సిద్ధరామయ్యకు ఇష్టం లేదని దేవెగౌడ చేసిన ఆరోపణలను కూడా తోసిపుచ్చారు. కాగా-కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని సిద్దూ లోలోపలే వ్యతిరేకించారని దేవెగౌడ పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని, ఇవి రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని సిద్దరామయ్య తూర్పారబట్టారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్ప కూలడానికి ఇలా మీరంటే మీరే కారకులని కాంగ్రెస్, జేడీ-ఎస్ నేతలు ఒకరినొకరిని దూషించుకోవడంతో.. ఈ వైనాన్ని కర్ణాటకలోని ఎడియురప్ప ప్రభుత్వం చోద్యంగా చూస్తోంది. ఒకప్పుడు రాహుల్, సోనియా ఆశీస్సులతో ఏర్పడిన సంకీర్ణ సర్కార్ కుప్పకూలడంతో.. ఇప్పుడు ‘ నాటకీయంగా ‘ ఈ పార్టీలు ఈ రకంగా వీధిన పడ్డాయి. ఆ మధ్య అసమ్మతివర్గ ఎమ్మెల్యేల్లో కొందరిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా ఎడియురప్ప తన ప్రభుత్వంలో తిరుగుబాటుకు అవకాశం లేకుండా చూశారు. అయితే… ఇది బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో జరిగింది. కర్ణాటకలో ఎలాగైనా పాగా వేసేందుకు కమలనాథులు వేసిన పథకం ఫలించి ఆ పార్టీకి లాభించింది.