పోటీ చేశానని నన్ను, నా కుటుంబాన్ని వెలి వేశారు.. అచ్చెన్నాయుడిపై సోదరుడి కుమారుడు సంచలన ఆరోపణలు

|

Feb 27, 2021 | 2:49 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కెలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబం మధ్య విభేదాలు తరాస్థాయికి చేరిన విషయం..

పోటీ చేశానని నన్ను, నా కుటుంబాన్ని వెలి వేశారు.. అచ్చెన్నాయుడిపై సోదరుడి కుమారుడు సంచలన ఆరోపణలు
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు, టెక్కెలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కుటుంబం మధ్య విభేదాలు తరాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అంతేకాదు. అచ్చెన్నాయుడి సోదరుడి కుమారుడిని ఎన్నికల్లో నామినేషన్‌ వేయకుండా బెదిరించారనే ఆరోపణలతో అచ్చెన్నాయుడు అరెస్ట్‌ అయ్యారు. ఇక పంచాయతీ ఎన్నికలు ముగిసి, తాజాగా మున్సిపల్‌ ఎన్నికలకు నగారా మోగడంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.

తాజాగా అచ్చెన్నాయుడుపై సోదరుడి కుమారుడు అప్పన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పంచాయితీ ఎన్నికల్లో నిమ్మాడ సర్పంచ్‌గా పోటీ చేశానని తనను, కుటుంబాన్ని వెలివేశారని ఆరోపించారు. అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్.. అతడి కుమారుడు సురేష్ పొలంలోకి కూలీలను రానివ్వకుండా అడ్డుపడుతున్నారుని.. పొలంలోకి వెళ్ళేందుకు దారి ఇవ్వడం లేదన్నారు. కూలీలు రాక రెండు ఎకరాల్లో మినప చేను పోయిందని.. ఊరిలో మిల్లుకు వెళ్ళి ధాన్యం ఆడించుకోలేని పరిస్ధితి ఉందన్నారు.

గ్రామంలో రజకులను, నాయీ బ్రహ్మణులను కూడా తన ఇంటికి రానివ్వడం లేదన్నారు అప్పన్న. తమ కుటుంబ సభ్యులతో కూడా ఎవ్వరూ మాట్లాడడం లేదని.. తనను చంపేస్తామని కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నేళ్ళు నిమ్మాడలో వారి రౌడీ పాలన కొనసాగుతుందని.. ప్రజాస్వామ్యం లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. నిమ్మాడలో తమకు జరుగుతున్న అన్యాయం పై పోలీసులను ఆశ్రయిస్తాను అన్నారు.

కింజారపు అచ్చెన్నాయడు కుటుంబంలో పంచాయతీ ఎన్నికలు చిచ్చురేపాయి. అచ్చెన్న స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి వైఎస్సార్‌‌సీపీ బలపరిచిన అభ్యర్థిగా కింజరాపు అప్పన్నను పోటీ చేశారు. తన సోదరుడి కుమారుడైన అప్పన్నను నామినేషన్‌ వేయొద్దని.. అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికీ అప్పన్న ఆయన మాట వినలేదు.. ఆయన నామినేషన్ వేశారు.. ఈ క్రమంలో గ్రామంలో ఉద్రిక్తత కనిపించింది. అప్పన్నను బెదిరించారనే కారణంతో అచ్చెన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయగా.. బెయిల్‌పై విడుదలయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు.

పంచాయతీ ఎన్నికల వేళ అచ్చెన్నాయుడు అరెస్ట్ కు దారి తీసిన పరిస్థితులు:

ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో టెక్కెలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు రాగా.. అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గొడవ మొదలవగా.. నిమ్మాడ నుంచి వైసీపీ తరఫున కింజరాపు అప్పన్న సర్పంచ్‌గా పోటీకి బరిలోదిగాడు. అప్పన్న.. అచ్చెన్నాయుడు అన్న కుమారుడు. అప్పన్నను నామినేషన్‌ వేయొద్దని అచ్చెన్నాయుడు ఫోన్‌ చేసి బెదిరించినట్లు వైసీపీ ఆరోపించింది. ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయగా.. ఈ విషయంపై రాజకీయంగా విమర్శలు తలెత్తాయి. టీడీపీ నేతలు అక్రమ అరెస్ట్ అంటూ ఆందోళన చేశారు. అచ్చెన్నాయుడు స్వగ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది అచ్చెన్నాయుడును కోటబొమ్మాళి పోలీస్‌స్టేషన్‌‌కు తరలించగా.. 22 మందిపై కేసు నమోదైంది.

Read more:

ముగిసిన చంద్రబాబు కుప్పం పర్యటన.. ఆ ఆయుధంతో వైసీపీని తిప్పి కొట్టాలన్న టీడీపీ అధినేత