Nagababu about Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిని వైసీపీ రాజ్యసభకు పంపబోనుందని ఇటీవల వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దానికి తోడు జగన్ ప్రభుత్వంపై చిరు పలుమార్లు ప్రశంసలు కురిపించడంతో.. ఈ ప్రచారానికి బలం చేకూరింది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు స్పష్టతను ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నాగబాబు చెప్పుకొచ్చారు. కొందరు కావాలనే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నారని.. ప్రస్తుతం చిరంజీవికి జనసేన సహా ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్లో ఛానెల్లో మాట్లాడిన నాగబాబు.. పలు విషయాలు కూడా పంచుకున్నారు.
‘‘చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం అంటూ కొన్ని వెబ్సైట్లు గత కొన్ని రోజులుగా తప్పుడు వార్తలతో గందరగోళం సృష్టిస్తున్నాయి. అన్నయ్య ఇకపై పూర్తిగా సినిమాలకు పరిమితం అవుతారు. తన జీవితాన్ని మళ్లీ సినిమాలకే అంకితం ఇచ్చేశారు. అందుకే రాజకీయాలను పూర్తిగా వదిలేసి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో అన్నయ్య ఆచార్య సినిమా చేస్తున్నారు. ఆ తరువాత మరో సినిమా కూడా మొదలవుతుంది. మా కుటుంబంలోని నటులందరి కంటే అన్నయ్యనే సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా గొప్ప స్వాగతం లభిస్తుంది. రాజ్యసభ సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అన్నదమ్ములిద్దరం ఒకే రంగంలో ఉండటం ఎందుకనే ఉద్దేశంతోనే చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు. తమ్ముడు పవన్ కోసమే అన్నయ్య రాజకీయాలను త్యాగం చేశారు. రాజకీయాల్లో తనకంటే పవన్ అద్భుతంగా ప్రజలకు సేవ చేయగలడని అన్నయ్య నమ్ముతున్నారు.
తమ్ముడు పవన్ ఆలోచనలను ఓ అన్నయ్యగా చిరంజీవి సమర్థిస్తున్నారు. తమ్ముడికి ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే తాను అందులో ఉండకూడదని అన్నయ్య నిర్ణయించుకున్నారు. అన్నయ్యకు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికీ అవి కొనసాగుతాయి. అంతమాత్రాన ఆయా పార్టీల నిర్ణయాలకు ఆయన వంతపాడరు. ఇటీవల కొంతమంది చిరంజీవి ఇంటిముందు ధర్నా చేయాలనే ప్రతిపాదన చేశారు. అది చాలా తప్పుడు నిర్ణయం. చిరంజీవిపై ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలి. ఏదేమైనా ప్రస్తుతం సినిమాలకు తప్ప రాజకీయాల గురించి ఆలోచించే సమయం అన్నయ్యకు లేదు’’ అని చెప్పుకొచ్చారు నాగబాబు. మరి ఈ వార్తలకు ఇప్పటికైనా చెక్ పడుతుందేమో చూడాలి.
Read This Story Also: రజనీ నెక్స్ట్ స్టెప్ ఏప్రిల్లో… మ్యాటర్ ఇదే