విద్యారంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష.. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా..? -మంత్రి కేటీఆర్‌

|

Mar 09, 2021 | 7:51 AM

వివిధ రంగాల్లో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో..

విద్యారంగంలో తెలంగాణపై కేంద్రం వివక్ష.. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ అంటే ఇదేనా..? -మంత్రి కేటీఆర్‌
Follow us on

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం అన్ని రంగాల్లో వివక్ష చూపిస్తుందని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీ ఫార్మసీ కాలేజీలో విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలు ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. జాతీయ స్థాయిలో ఐఐఎం, ఐసర్‌, ఎన్‌ఐడీ, మెడికల్‌ కాలేజీలను స్థాపించిన కేంద్రం తెలంగాణకు ఒక్క సంస్థను కూడా కేటాయించలేదని విమర్శించారు. కేంద్రం పదే పదే చెప్తున్న ‘సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రధాని చెప్పే టీమిండియా స్ఫూర్తి ఇదేనా అని నిలదీశారు.

వివిధ రంగాల్లో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన సంస్థలను తెచ్చామని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకోసం 672 గురుకులాలను ఏర్పాటుచేశామని చెప్పారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నదని చెప్పారు. రూ.350 కోట్లతో 240 గురుకులాలకు శాశ్వత భవన నిర్మాణ పనులు మొదలయ్యాయని పేర్కొన్నారు. అంతేకాకుండా 15 లక్షల మంది విద్యార్థులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నామని వివరించారు. హాస్టళ్లలో మెస్‌చార్జీలను పెంచామని గుర్తుచేశారు. రూ.12,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విద్యార్థులకోసం చెల్లించినట్టు వెల్లడించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున గురుకులాల స్థాపనతోపాటు 53 డిగ్రీ కాలేజీలు, 11 పాలిటెక్నిక్‌ కాలేజీలు, 5 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటుచేశామని మం త్రి కేటీఆర్‌ తెలిపారు. విద్యార్థులకు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, విదేశాల్లో చదువుకొనేందుకు ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తున్నామని, ఈ స్కీం కింద ఇప్పటివరకు 3,850 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకొంటున్నారన్నారు. రూ. 250 కోట్లతో పోటీ పరీక్షలకోసం జిల్లాస్థాయిలో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. స్టడీ సర్కిళ్లద్వారా దాదాపు ఐదువేల మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. అరవై ఏండ్లలో సాధ్యం కాని ప్రగతిని ఆరేండ్లలో చేసి చూపించామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

రాష్ట్రంలో తాగునీరు, విద్యుత్తు వంటి మౌలిక సమస్యలను పరిష్కరించామని, వైద్య సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టామని, ఒక్క హైదరాబాద్‌లోనే 350 బస్తీ దవాఖానలను ఏర్పాటుచేశామని వివరించారు. ఇంకా చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సురభి వాణీదేవి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు మాత్రమే కాదని.. ఆమెకు ఉన్నత విద్యావంతురాలుగా మండలిలో కూర్చొనే అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 19,200 టీచర్‌ పోస్టులు భర్తీ చేశామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. అయినా, బీజేపీ, కాంగ్రెస్‌ తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 15 వేల కంపెనీలకు అనుమతులిచ్చి, 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు సృష్టించగలిగామని చెప్పారు. గత ఆరేండ్లుగా తెలంగాణ ఇంతగా అభివృద్ధి చెందుతుంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభించడంలేదని అన్నారు. ఐటీఐఆర్‌, కోచ్‌ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్‌ వంటి విభజన హామీలనూ బుట్టదాఖలు చేసిందని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Read More:

ఎవడైనా మీదికొస్తే ఇలా ఎదుర్కోవాలి.. విద్యార్థినులకు సెల్ఫ్‌డిఫెన్స్‌లో మెళకువలు..