Glass Symbol: ఇండిపెండెంట్లకు గ్లాసు సింబల్ కేటాయింపు.. కూటమి ఓటుకు బీటలు వారతాయా?
గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కుతుంది. ఇది సినిమా డైలాగ్. సింబల్ కేటాయించే కొద్దీ ఓటు చీలే అవకాశం ఉంటుంది. ఇది పొలిటికల్ డైలాగ్. జనసేన ఎన్నికల గుర్తు.. గాజు గ్లాసు. ఇప్పుడు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గ్లాస్మేట్స్గా మారారు. వీళ్లకు రెబల్ గ్లాసులు తోడయ్యాయి. పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు... ఎన్ని ఓట్లను కోసేస్తుంది. అదే ఇప్పుడు కూటమిని కలవరపెడుతోంది.
గ్లాసు పగిలేకొద్దీ పదునెక్కుతుంది. ఇది సినిమా డైలాగ్. సింబల్ కేటాయించే కొద్దీ ఓటు చీలే అవకాశం ఉంటుంది. ఇది పొలిటికల్ డైలాగ్. జనసేన ఎన్నికల గుర్తు.. గాజు గ్లాసు. ఇప్పుడు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గ్లాస్మేట్స్గా మారారు. వీళ్లకు రెబల్ గ్లాసులు తోడయ్యాయి. పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు… ఎన్ని ఓట్లను కోసేస్తుంది. అదే ఇప్పుడు కూటమిని కలవరపెడుతోంది.
స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించ వద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పిటిషన్ హైకోర్టును ఆశ్రయించారు. ఫ్రీ సింబల్ నుంచి గాజు గ్లాసును తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా.. ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించటం వల్ల ఎన్డీయే కూటమికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. మరోవైపు జనసేన ఇచ్చిన అభ్యర్ధనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో యాంటీ వైసీపీ ఓట్లు చీలకూడదనేది పవన్ కల్యాణ్ కాన్సెప్ట్. బీజేపీ హైకమాండ్తో చీవాట్లు తిని మరీ, టీడీపీని కూటమిలో చేర్చుకునేలా చేశానని ఆయనే గతంలో చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ ఆలోచనలకు, ఆశలకు భారీ గండి పడే సూచనలు కనిపిస్తున్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు. జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు. అది కాస్తా ఇప్పుడు ఫ్రీ సింబల్గా మారింది. అంటే జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ సీట్లను మినహాయిస్తే ఏపీలోని మిగిలిన స్థానాల్లో అదే సింబల్ మీద ఇండిపెండెంట్లు కూడా పోటీ చెయ్యొచ్చు. అదే ఇప్పుడు జరిగింది. జనసేన పోటీలో లేని స్థానాల్లో టీడీపీ, జనసేన రెబల్స్తో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించింది ఈసీ. అదే ఇప్పుడు కూటమిలో కలవరం రేపుతోంది. దీనివల్ల కూటమి ఓట్లు చీలిపోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆయా పార్టీల వర్గాలు.
విజయవాడ ఎంపీ స్థానంలో నవతరం పార్టీ నుంచి పోటీ చేస్తున్న వై. కృష్ణ కిషోర్కు.. గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇక రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నవతరం పార్టీ అభ్యర్థి బి. నరేష్కు గ్లాసు గుర్తు దక్కింది. కాళహస్తిలో ఇండిపెండెంట్ అభ్యర్థి తీగల భాస్కర్కు గాజు గ్లాసు సింబల్ కేటాయించారు. కుప్పంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న….వైసీపీ సర్పంచ్ భార్య నీలిమకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. మదనపల్లెలో ఇండిపెండెంట్ అభ్యర్థి షాజహాన్కు గ్లాసు గుర్తు దక్కింది. చంద్రగిరిలో స్వతంత్ర అభ్యర్థి వెంకట కృష్ణమూర్తికి గ్లాసు గుర్తు కేటాయించారు. కమలాపురంలో స్వతంత్ర అభ్యర్థి, రాజోలి వీరనారాయణరెడ్డికి గ్లాసు టంబ్లర్ గుర్తును కేటాయించారు.
ఇక రాజంపేటలో రెడ్డం చిన్న పెంచలయ్య అనే స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. కావలిలో టీడీపీ రెబల్ పసుపులేటి సుధాకర్కు గ్లాస్ గుర్తు దక్కింది. చీరాలలో స్వతంత్ర అభ్యర్థి పోలిశెట్టి శ్రీనివాసరావుకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇక రాజమండ్రి ఎంపీ సీటులో, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీకి చెందిన మేడా శ్రీనివాస్కు గ్లాస్ టంబ్లర్ గుర్తును కేటాయించారు. జగ్గయ్యపేటలో స్వతంత్ర అభ్యర్థి ప్రకాశరావుకు గ్లాస్ సింబల్ కేటాయించారు. మచిలీపట్నంలో స్వతంత్ర అభ్యర్థి మనోహర్కు కూడా గాజు గ్లాసు గుర్తు దక్కింది. గాజువాకలో కాకర్లమూడి కృష్ణ ప్రదీప్ అనే స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు సింబల్ను కేటాయించారు. శృంగవరపుకోటలో స్వతంత్ర అభ్యర్థి లోకాభిరామ్కు గాజు గ్లాసు సింబల్ దక్కింది.
ఇక జగ్గంపేటలో టీడీపీకి జనసేన రెబల్ పోటు తగిలింది. జనసేన రెబల్గా ఎన్నికల బరిలో దిగిన పాఠంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. సూర్యచంద్ర…జగ్గంపేట నుంచి జనసేన టికెట్ ఆశించారు. టికెట్ రాకపోయేసరికి భార్యతో కలిసి దేవాలయంలో ఆమరణ నిరాహార దీక్ష అంటూ హల్చల్ కూడా చేశారు. తాను గెలిచి పవన్కి జగ్గంపేటను గిఫ్ట్గా ఇస్తానంటున్నారు సూర్యచంద్ర. ఇక విజయనగరంలో టీడీపీ రెబల్ మీసాల గీతకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించారు. మీసాల గీత ఆప్షన్ మేరకు ఆమెకు గ్లాస్ గుర్తును కేటాయించారు.
గాజు గ్లాసు గుర్తు…ఫ్రీ సింబల్ లిస్టులో ఉంది. జనసేన పోటీ చెయ్యని స్థానాల్లో…స్వతంత్ర అభ్యర్థులు కోరితే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నారు. ఇదే ఇప్పుడు కూటమికి తలనొప్పిగా మారింది. పగిలిన కొద్దీ పదునెక్కే గ్లాసు… ఎన్ని ఓట్లకు కోత పెడుతుంది అనేదానిపై కూటమిలో చర్చ నడుస్తోంది.
మరిన్ని ఆంధ్ర ప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..