హైదరాబాదు లాంటి నగరాలను 20 తయారు చేస్తా.. ఆ సత్తా నాకు ఉంది అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రచార సభలో స్పష్టం చేశారు. పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్, అసెంబ్లీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్ గెలుపును ఆకాంక్షిస్తూ గురువారం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యమంత్రి యువతకు, రైతుకు, మహిళలకు ఉత్సాహాన్ని అందిస్తూ కార్యకర్తలకు మనోబలాన్ని ఇస్తూ ప్రసంగించారు. జగన్, నరేంద్ర మోడి, కేసీఆర్లు అందరూ కలిసి ఏకమైనా ఏమీ చేయలేరన్నారు.
ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబుపై చంద్రబాబు మండిపడ్డారు. సిగ్గు లేకుండా పార్టీ మారతావా అంటూ ప్రశ్నించారు. నీ లాంటి వాళ్లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అంటూ హెచ్చరించారు. రాజకీయంగా జీరో అవుతావు అన్నారు. పార్లమెంటులో మిస్టర్ పీఎం అంటూ ప్రధాన మంత్రిని పిలిచిన వ్యక్తి గల్లా జయదేవ్ అన్నారు. అందుకోసం జయదేవ్ను అనేక విధాలుగా బెదిరించారని, అయినా ఏ మాత్రం లెక్కచేయకుండా ..‘నా తాత జైలుకు వెళ్లాడు. నేను కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానని’ చెప్పి ఎదురు నిలిచిన వ్యక్తి జయదేవ్ అంటూ కొనియాడారు.