
Cash Flow Started: ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటినుంచే మొదలైంది నగదు ప్రవాహం. దూరాలోచన ఉన్నవారు ముందే ఎక్కడికక్కడ సెట్ చేసుకుంటే… చివర్లో పంపకాలతోనే గుర్తు గుర్తుండిపోతుందనుకునేవారు చివరిక్షణందాకా అడ్డదారులు తొక్కుతూనే ఉంటారు. ఏపీలో మున్సిపోల్స్లో అదే జరుగుతోంది. ప్రచారం ముగియగానే ప్రలోభాలకు దారులు వెతుకుతున్నారు కొందరు అభ్యర్థులు. ఓట్లకోసం నోట్లు సిద్ధంచేసుకుంటున్నారు. ఎలాగోలా కరెన్సీ కట్టలు చేరేలా చూసుకుంటున్నారు. బెడిసికొట్టిన చోట దొరికిపోతున్నారు.
కొన్ని గంటల వ్యవధిలో రెండుచోట్ల కోటి రూపాయలకు పైగా డబ్బు దొరికింది. కర్నూలు శివార్లలో ఎస్ఈబీ అధికారుల తనిఖీల్లో ఏకంగా 55 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. పంచలింగాల చెక్పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీచేస్తుండగా ఓ కారులో భారీగా డబ్బుని గుర్తించారు అధికారులు.
హైదరాబాద్నుంచి బెంగళూరుకు తరలిస్తున్న 55 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మునిస్వామిగౌడ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులోని ఓ కాంట్రాక్టర్ దగ్గర గౌడ గుమస్తాగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ సొమ్ము మున్సిపల్ ఎన్నికల్లో పంచేందుకా…మరో కారణంతో తరలిస్తున్నారా అన్నదానిపై ఎంక్వయిరీ నడుస్తోంది.
ఇక ప్రిస్టేజియస్ ఫైట్ నడుస్తున్న బెజవాడలోనూ నగదు చేతులు మారుతోంది. ఎన్నికల నేపథ్యంలో సీపీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించిన టాస్క్ఫోర్స్ పోలీసులు ఓ వెల్డింగ్ వర్కర్ ఇంట్లో ఏకంగా 48లక్షల 40వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోసం ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు సిద్ధంచేసినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసి ఎంక్వయిరీ చేస్తున్నారు. భారీగా డబ్బుదొరకటం బెజవాడలో కలకలం రేపుతోంది.
పెద్దగా క్యాష్పార్టీలు కానివాళ్లు…ఓటర్లకు తమ పరిధిలో తోచిందేదో ఇస్తున్నారు. కృష్ణాజిల్లా నందిగామ పట్టణంలో ఇంటింటికీ తిరిగి ఓట్లడుగుతూ.. జాకెట్ ముక్కలు, గాజులు, బొట్టు బిళ్ళలు చేతిలో పెడుతున్నారు. విషయం పోలీసుల దృష్టికి రావటంతో కొందరిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.