
పుణ్యక్షేత్రాల్లో తొక్కిసలాటలు: ఈ ఏడాది ఆరంభంలోనే ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పెను విషాదం చోటుచేసుకుంది. జనవరి 29న అమృత స్నానం కోసం వచ్చిన భక్తుల రద్దీని నియంత్రించడంలో యంత్రాంగం విఫలమవడంతో జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆగస్టులో వైష్ణో దేవీ ఆలయం వద్ద కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 34 మంది యాత్రికులు మరణించడం భక్తులను కలచివేసింది.

గగనతలంలో ఘోరప్రమాదం: జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం దేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులతో పాటు హాస్టల్లో ఉన్నవారు కలిపి మొత్తం 270 మందికి పైగా మరణించారు. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడడం గమనార్హం.

ఆర్సీబీ సంబరాల్లో తొక్కిసలాట: దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ అభిమానులకు జూన్ 4 చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన విజయోత్సవ ర్యాలీలో భారీగా తరలివచ్చిన జనసందోహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు విడిచారు. క్రీడా చరిత్రలో ఇదొక అత్యంత దురదృష్టకరమైన రోజుగా మిగిలిపోయింది.

ప్రకృతి ప్రకోపం: ఆగస్టు 5న ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో సంభవించిన క్లౌడ్ బరస్ట్ వల్ల కొండచరియలు విరిగిపడి 70 మంది మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జూలై 9న గుజరాత్లోని వడోదరలో గంభీర వంతెన కూలిపోవడంతో 22 మంది జలసమాధి అయ్యారు. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు సట్లెజ్, బియాస్ నదులు ఉప్పొంగి పంజాబ్ను ముంచెత్తాయి. ఈ వరదల్లో 30 మంది చనిపోవడమే కాకుండా 1.48 లక్షల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది.

విజయ్ ర్యాలీలో తొక్కిసలాట: సెప్టెంబరు 27న తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ అధినేత, సూపర్ స్టార్ విజయ్ నిర్వహించిన బహిరంగ సభ మారణహోమంగా మారింది. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సెప్టెంబర్ 14న రాజస్థాన్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 20 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు.