
కరోనా వైరస్ థర్డ్ వేవ్.. ఇప్పుడు ప్రపంచానికి గుబులు పుట్టిస్తోంది. మూడో దశలో పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన రెట్టింపు అవుతోంది. దీనితో తాజాగా చిన్నపిల్లల్లో కరోనా తీవ్రత, చికిత్సకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) మార్గదర్శకాలు జారీ చేసింది.

ఐదేళ్లలోపు చిన్నారులకు మాస్కులు అవసరం లేదని.. కానీ 6-11 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలు మాత్రం తల్లిదండ్రులు, డాక్టర్ పర్యవేక్షణలో మాస్క్ ధరించవచ్చునని కేంద్రం స్పష్టం చేసింది.

అలాగే కరోనా సోకిన 18 సంవత్సరాలులోపు వయస్సు ఉన్న పిల్లలకు ఎట్టిపరిస్థితుల్లోనూ రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది. పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో హై-రెజల్యూషన్ సీటీ స్కాన్ను తీయించాలని సూచించింది.

స్టెరాయిడ్లను కూడా దాదాపు వాడవద్దన్న ఆరోగ్యశాఖ, అత్యంత క్రిటికల్ అనుకున్న కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్లను ఆప్షన్గా భావించాలన్నారు. లక్షణాలులేని, మధ్యస్థాయి లక్షణాలు ఉన్నవారికి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని, వీటివల్ల హానికరమని కేంద్రం పేర్కొంది.