
చాలా మంది లాంగ్ రైడ్స్ కు వెళ్లే బైక్స్, కార్లకు కొన్ని రంగురంగుల ఫ్లాగ్స్ ఉంటాయి. వీటిని ఫ్యాషన్, స్టైల్ కోసం కట్టుకుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ దీని వెనుక వేరే కారణం ఉంది. వీటిని టిబెటన్ ప్రార్థన జెండాలు అంటారు. ఈ టిబెటన్ ప్లాగ్స్ బౌద్ధ సంప్రదాయం, మత విశ్వాసం, ప్రకృతి పట్ల గౌరవాన్ని సూచిస్తాయి. అలాగే, జెండాల్లోని ఐదు రంగులు ఐదు అంశాలు, ఐదు దిశలను సూచిస్తాయి. నివేదికల ప్రకారం.. ఈ జెండాల్లో ఉన్న ఒక్కో రంగుకు ఒక్కో ప్రత్యేక ఉంటుంది.

ఈ జెండాలలోని ఐదు రంగులు ఐదు మూలకాలను సూచిస్తాయి. మొదటి రంగు నీలం, ఇది ఆకాశం, తూర్పు దిశను సూచిస్తుంది. తెలుపు రంగు గాలి, పశ్చిమ దిశను సూచిస్తుంది. ఎరుపు రంగు అగ్నిని, దక్షిణ దిశను సూచిస్తుంది. ఆకుపచ్చ నీరు, ఉత్తర దిశను సూచిస్తుంది. పసుపు భూమి కేంద్రాన్ని సూచిస్తుంది. బౌద్ధ విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ జెండాలను శాంతి, కరుణను చిహ్నంగా భావిస్తారు.

టిబెటన్ బాషలో వీటిని దార్-చో అని పిలుస్తారు. దార్ అంటే జీవితం, సంపద, శ్రేయస్సు, ఆరోగ్యం అని అర్థం, అయితే చో అంటే అన్ని జీవులు అని అర్థం. ఈ జెండాలు గాలిలో ఎగురుతున్నప్పుడు, వాటి శక్తి చాలా దూరం వ్యాపించి, అందరికీ శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. అందుకే వాహనాలకు ముందు వీటిని కడతారు.

ఈ జెండాలపై ఉండే రాతలకు అర్థం ఏంటి: ఈ జెండాలపై టిబెటన్ లిపిలో ఓం మణి పద్మే హమ్ అని రాసి ఉంటుంది. దీనిలోని ఓం అనేది అత్యంత పవిత్రమైన పదం, అలాగే మణి అంటే రత్నం, పద్మే అంటే కమలం, హమ్ అంటే జ్ఞానోదయం పొందిన ఆత్మ. ఇది కరుణ, నైతికత, ఓర్పు, కృషి, త్యాగం, జ్ఞానం వంటి విలువల కలయిక. ధ్యానం సమయంలో మంత్రాన్ని జపించడం వల్ల అహం, అసూయ, అజ్ఞానం, దురాశ అన్ని తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు.

వీటిని బైక్స్ పై ఎందుకు కడతారు: ఓం మణి పద్మే హమ్ అనే మంత్రం ఉన్న ఈ జెండాలను బైక్కు ముందు బాగంలో కట్టడం వల్ల అవి గాలికి ఎగురుతున్నప్పుడు దానిపై ఉన్న మంత్రం నుంచి వెలువడే శక్తి మనకు నేరుగా తాకుతుంది. ఇది మనల్ని అన్ని ప్రమాదాల నుండి రక్షిస్తుందని, ఈ మంత్రాల సానుకూలత వాతావరణంలోకి కలిసి ప్రవహిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ జెండాలను బైక్లపై కడతారు. టిబెటన్లు వీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే వీటిని చెత్తలోగాని, నేలపైకాని అస్సలు వేయరు.