
చేప ముల్లు కడుపులోకి వెళ్తే ప్రమాదమా?: సాధారణంగా కొన్ని చేపల్లో ముళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముళ్లను వేరు చేసి కేవలం మాంసాన్ని మాత్రమే తినడం మంచిది. అయితే, కొన్నిసార్లు పొరపాటున అన్నంతో పాటు ముల్లు కడుపులోకి వెళ్లవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చేప ముల్లు మన జీర్ణాశయంలోనే జీర్ణమైపోతుంది కాబట్టి, ప్రేగులకు దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

అయితే సమస్య అంతా అది కడుపులోకి వెళ్లే దారిలో, అంటే గొంతులో లేదా అన్నవాహికలో గుచ్చుకున్నప్పుడే వస్తుంది! దీనివల్ల ప్రతి ముద్ద మింగేటప్పుడు ఆ ముల్లు గుచ్చుకుంటూ నొప్పి కలిగిస్తుంది. ఒకవేళ మీకు ఇలా జరిగితే, ఉపశమనం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అరటి పండు: ఒకవేళ గొంతులో లేదా అన్నవాహికలో చేప ముల్లు ఇరుక్కుపోతే వెంటనే మీరు ఒక పండిన అరటిపండును తీసుకొని తినండి అయితే దాన్ని నమిలి తినకుండా ముక్కను నేరుగా మింగేయండి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇలా ఒకటి రెండు సార్లు చేస్తే మీ గొంతులో ఇరుక్కుపోయిన ముళ్లు త్వరగా వదిలిపోచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వేరుశనగ గింజలు: గొంతులో ఇరుక్కున్న చేపముళ్లును తొలగించేందుకు ఇది మరో మార్గం. బాగా వేయించిన కొన్ని వేరుశనగ గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగండి. ఈ పద్ధతి ద్వారా కూడా గొంతులో చిక్కుకున్న ముల్లు తొలగిపోయే అవకాశం ఉంది. అంతే కాదు ఒక బ్రెడ్ ముక్కకు కొంచెం పీనట్ బటర్ రాసి, దాన్ని బాగా నమిలి మింగండి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగండి. దీనివల్ల కూడా గొంతులోని ముల్లు తొలగిపోయే అవకాశం ఉంది.

ఒకవేళ ముల్లు తొలగకపోతే: పైన చెప్పిన చిట్కాలు పాటించినా ముల్లు పోకపోయినా, లేదా ఆహారం తినేటప్పుడు గొంతులో విపరీతమైన నొప్పి వస్తున్నా, వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోండి. ఈ విషయంలో ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఆ ముల్లు అక్కడే ఉండిపోతే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముల్లు గొంతులో లోతుగా లేదా అన్నవాహికలో గట్టిగా గుచ్చుకుంటే, కొన్నిసార్లు ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.(Note పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించబడినవి. వీటిని ప్రయత్నించే ముందు వైద్యులను సంప్రదించండి)