
Rain Alert For AP and Telangana: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.. వర్షాలు కొన్ని చోట్ల కురవకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురవాలంటూ ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

రాబోయే 3 రోజులలో హైదరాబాద్తోపాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తేలికపాటు నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని చోట్ల మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశముంది.

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇలానే వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది.

ఇదిలాఉంటే.. నైరుతి రుతుపవనాలు మరికొన్ని రోజుల్లో ఉపసంహరించుకునే అవకాశముంది.. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ చివర్లో, అక్టోబర్ నెల ప్రారంభంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గతంతో పొలిస్తే.. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.

రాబోయే కొద్ది రోజులలో వర్షపాతం సాధారణం నుంచి పెరుగుతుందని అంచానా వేస్తోంది. సెప్టెంబర్ 21 నుంచి రుతుపవనాలు పుంజుకుని, నెలాఖరు వరకు చురుకుగా మారుతాయని.. అక్టోబర్ మొదటి వారం వరకు కూడా కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది.