
పనస పండు మలయాళీలకు ఇష్టమైన పండు. అందుకే దేశ విదేశాల్లో ఎక్కడ ఉంటున్నా.. కేరళ వాసులు పనసపండును అధిక ధరకు కొనుగోలు చేస్తారు. అయితే ఎంత ఇష్టమైన పండు అయినా సరే.. లక్షల రూపాయలను చెల్లించి కొనుగోలు చేస్తారా..! తాజాగా దక్షిణ కర్ణాటకలోని బంద్వాల్ లో పనసపండును లక్షలుపోసి కొంగలు చేశారన్న వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

భక్తులు పుణ్యక్షేత్రాల్లో సమర్పించే పండ్లు, ఇతర వస్తువులను పవిత్రమైనదని భావిస్తారు. తమకు నచ్చిన వాటిని మార్కెట్ ధర కంటే ఎక్కువ ధర వెచ్చించి కొనుగోలు చేయడం సర్వసాధారణం. అయితే ఒక వ్యక్తి వేలంలో రూ.4.33 లక్షలు ఖర్చు చేసి పనసపండును కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మూలరపట్నంలో ఓ పునరుద్ధరించబడిన మసీదు ప్రారంభోత్సవానికి సంబంధించి సిరాజుద్దీన్ కాసిమి ఉపన్యాసం ఇచ్చారు. ఉపన్యాసం అనంతరం మసీదులో నైవేద్యంగా పెట్టిన పనసపండుని వేలం వేయడం ప్రారంభించారు. వేలం స్వల్ప మొత్తంతో ప్రారంభమై రూ.4,33,333 వద్ద ముగిసింది.

ఈ వేలం పాటలో స్థానిక నాయకులు అజీజ్, లతీఫ్ పోటీపడ్డారు. చివరికి పనసపండుని రూ.4,33,333కి చక్కా లతీఫ్ సొంతం చేసుకున్నాడు. వేలం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, లతీఫ్ స్థానికంగా స్టార్ అయ్యాడు.కేవలం పనస పండు కోసం లతీఫ్ భారీ వేలంపాటలో చెల్లించినందుకు అందరూ షాక్ తిన్నారు.

ఇదే సమయంలో మసీదుకు చెందిన ఇతర వస్తువులు.. అంటే మసీదుకు భక్తులు విరాళంగా అందించిన ఇతర వస్తువులను కూడా మంచి ధరకు వేలం వేశారు. ఇలా వేలంలో వచ్చిన మొత్తం పరిపాలనా కమిటీకి అప్పగించబడుతుంది.

అయితే గతంలో కూడా ఓ ప్రార్ధనా మందిరంలోని పనస పండుని వేలం వేయగా లక్ష రూపాయలు పలికింది స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో పనసపండుని వేలం వేశారు. చర్చిలో పనస పండుని వేలం వేయగా 1,400 పౌండ్లు పలికింది. అంటే మన దేశ కరెన్సీలో రూ. 1,40,000.

ఎడిన్బర్గ్లోని సెయింట్ అల్ఫోన్సా అండ్ ఆంథోనీ చర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని చర్చి అధికారులు తెలిపారు