
వాస్తూ ప్రకారం పురాతన కాలం నుండి రోలు, రోకలి, చేట, జల్లెడ, గంధం అరగదీసే సాన, కల్వం, చల్లకవ్వం, పప్పు గుత్తి, కుంపటి వంటి వస్తువులను లక్ష్మీప్రదాలుగా మన పెద్దలు పరిగణించేవారు. అయితే మారుతున్న టెక్నాలజీతో వాటి వాడకం తగ్గిపోయిందని.. దీంతో ఇంట్లో ఉన్న ఈ వస్తువులను ఓ మూల పడేసి, వాడకుండా వదిలేస్తే దాని నుంచి ఎలాంటి ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు.

వీటిని నిత్యం వాడుతూ, శుభ్రంగా ఉంచుకుంటూ, కాళ్ళతో తన్నకుండా, చెత్తతో కలపకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు.ఉదాహరణకు, రోలు రోకలిని ఉపయోగించి దంచడం, చేటతో బియ్యం చెరగడం వంటి పనులు చేయడం ద్వారా శ్రమకు ప్రాధాన్యతగా పరిగణిస్తారు. ఇలా పని చేసే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెబుతున్నారు

పరిశుభ్రత లక్ష్మీ కటాక్షానికి మరొక ముఖ్యమైన అంశమని.. వాకిలి గుమ్మానికి పసుపు రాయడం, ముగ్గులు వేయడం, ఇంట్లో దీపం వెలిగించడం వంటివి కేవలం సంప్రదాయాలు కాదని, అవి శుభ్రత, సానుకూలతను పెంపొందించే పనులని రమారావి పేర్కొన్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచడం, ముఖ్యంగా వంటగది, వాకిలిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, పాత, అనవసరమైన వస్తువులను ఇంట్లో నుండి తీసివేయడం ముఖ్యమని తెలిపారు.

శరీర పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని అంటున్నారు. తల దువ్వుకున్న వెంట్రుకలు, పాత తువ్వాళ్ళు, ఎక్కడపడితే అక్కడ పడి ఉన్న బట్టలు వంటివి ఇంట్లో ఉండకూడదని.. చెత్తబుట్ట, చీపురు వంటి వస్తువులు కూడా ఇంటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి కాబట్టి వాటిని కూడా గౌరవించి, సరైన స్థలంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

లక్ష్మీదేవి చంచలమైనది, ఆమె ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు.. లక్ష్మీదేవి అనుగ్రహం స్థిరంగా ఉండాలంటే, కేవలం ధనంపై దృష్టి పెట్టకుండా, సంతోషం, ఆరోగ్యం, కుటుంబ అన్యోన్యత వంటి వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలంటున్నారు. నిరంతరం పని చేసే గుణం, శ్రమ పట్ల శ్రద్ధ, ఏ పనినైనా చిన్నదిగా భావించకుండా చేయగలగడం, ఇతరులకు సహాయపడటం వంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నచోట లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ( Note : పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించట్లేదు)