
మన రోజువారీ ఆహారంలో తెలిసో.. తెలియకో.. రక్తపోటు, ఊబకాయం, టైప్-2 మధుమేహం, గుండె జబ్బులను పెంచే అనేకరకాల ఆహారాలు తింటున్నాం. వీటివల్ల మన ఆయుర్దాయం గణనీయంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ 5 రకాల ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే మీ అయుష్షు అంత గట్టిగా ఉంటుంది. అవేంటంటే..

ప్రాసెస్ చేసిన మాంసాహారాలు, సాసేజ్, బేకన్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే బర్గర్లు, పిజ్జాలలో వాడే మాంసాన్ని అస్సలు తినకూడదు. ఐతే పరిమిత పరిమాణంలో రెడ్ మీట్ తినొచ్చు.

ఇన్స్టంట్ నూడుల్స్ తినే అలవాటు మీకు ఉంటే ఈరోజు నుంచి వాటిని తినడం మానుకోవాలి. ఈ రకమైన ఆహారాల్లో సోడియం అధికంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతోపాటు గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

చాలా మంది మ్యూస్లీ, కార్న్ఫ్లేక్స్ లను బ్రేక్ ఫాస్ట్గా తీసుకుంటుంటారు. ఇలాంటి ఆహారాలు కూబి ఆరోగ్యానికి అంత మంచివికావు. ఈ విధమైన ఆహారాల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇది ఊబకాయం, టైప్-2 మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది.

మధ్యాహ్నం పూట ప్యాక్ చేసిన స్నాక్స్ తినకూడదు. అంటే చిప్స్, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యంగా ఉండాలంటే ప్యాక్ చేసిన ఆహారాలు తినడం మానుకోవాలి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని పూర్తిగా మానుకోవాలి. ఇటువంటి ఆహారాల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది ఊబకాయం, మధుమేహం ప్రమాదాన్ని సులువుగా పెంచుతుంది. ఈ విధమైన ఆహారాలు ఆయుర్దాయం తగ్గిస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.