
కావాల్సిన పదార్థాలు : పెద్ద సైజు తోటకూర కట్టలు: 3,నూనె: 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు: 1 టేబుల్ స్పూన్ (ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు), ఎండుమిరపకాయలు: 2 , కరివేపాకు: 2 రెమ్మలు, ఉల్లిపాయలు: 2 , పసుపు: అర టీ స్పూన్, ఉప్పు: 1 టీ స్పూన్ ,పొడి కోసం:, పల్లీలు: 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు: 12 , ధనియాలు: 1 టేబుల్ స్పూన్, జీలకర్ర: అర టీ స్పూన్, కరివేపాకు: 2 రెమ్మలు, నువ్వులు: 1 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు: 7-8

తయారీ విధానం : ముందుగా తోటకూర కట్టలను తీసుకొని, కాడలు తుంచి ఆకులను విడిగా చేయండి. తర్వాత నీళ్లల్లో వేసి కనీసం మూడు, నాలుగు సార్లు శుభ్రంగా కడగాలి. మట్టి లేకుండా చూసుకున్న తర్వాత, వడగిన్నెలో వేసి నీరంతా పోయేలా పక్కన పెట్టుకోండి. ఇవి కాస్త గాలి ఉండే చోట పెట్టుకోవాలి.

ఇప్పుడు తాళింపు కోసం తయారు చేసుకోవాలి. దీని కోసం ముందుగా ఒక పాన్ తీసుకొని, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. తర్వాత అందులో నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడిగా అయిన తర్వాత పోపు దినుసులు, ఆవాలు వేసి చిటపటమనిపించాలి. తర్వాత ఎండు మిరపకాయలు వేసి, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి. పోపు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, తోటకూర వేసి తక్కువ మంటపై మంచిగా వేయించుకోవాలి.

తోటకూర ఉడుకుతున్న సమయంలోనే పొడి తయారు చేసుకోవాలి. దీనికోసం, వేరొక పాన్ను స్టవ్ పైన పెట్టుకొని, పల్లీలు వేసి లో మీడియం మంటపై దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోండి. అదే పాన్లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో మాడకుండా దోరగా వేయించండి. ఇవి వేగిన తర్వాత, నువ్వులు వేసి అవి కూడా దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ వేయించిన పదార్థాలను చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. తర్వాత వీటన్నింటినీ మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకొని, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి.

తోట కూర పూర్తిగా ఉడికి, నీరు, నూనె ఇంకిపోయిన తర్వాత అందులో అరటీస్పూన్ పసుపు, ఉప్పు, వేసి మరో మూడు నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి, కారం, వేసి మరో ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తర్వాత మొత్తం మంచిగా కలపాలి. అన్నీ కలిసి కర్రీ కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ తోటకూర వేపుడు రెడీ