
గత కొన్ని రోజులుగా సామాన్యుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. నిత్యావసరాలు మొదలు అన్ని విషయాల్లోనూ షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. రోజురోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని కూరగాయ ధరలు సెంచరీ మార్క్ చేరుకున్నాయి. 10 రోజల క్రితం వరకు కిలో రూ.20 నుంచి 30 రూపాయలుగా ఉన్న టమాటా ధర ఇవాళ రూ.100కి చేరుకుంది. రానున్న రోజుల్లో కిలో రూ.120కి చేరే అవకాశం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. అటు, ఉల్లిపాయల ధర శనివారం రూ.40-రూ.60 ఉండగా, ప్రస్తుతం రూ.80కి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే కూరగాయల ధరలపై ఆర్బిఐ కూడా ఓ అధ్యయనం వెల్లడించింది.

‘ధరల పెరుగుదల వాస్తవమే’నని పేర్కొంటూ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ వెల్లడించిన అధ్యయనంపై, తాజాగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా మరింత విస్తృతంగా అధ్యయనం చేసి, ఒక నివేదిక విడుదల చేసింది. రిజర్వుబ్యాంకుకు చెందిన ఎకానమిక్ అండ్ పాలసీ రీసెర్చి విభాగం టమాటో, ఉల్లి (ఆనియన్), ఆలు (పొటాటో) ధరలపైనే కేంద్రీకరించి ఈ అధ్యయనం చేసింది.

ఆంగ్ల భాషలో ఈ మూడింటి మొదటి అక్షరాలను కలిపి (టిఓపి-టాప్)గా ఆర్బిఐ పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా ‘టాప్’ ధరలు చుక్కలు దాటి ఎలా పరుగులు తీస్తున్నాయో ఈ నివేదికలో వివరంగా వెల్లడించింది. ఆర్బిఐ అధ్యయన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలలో టమాటా, ఉల్లి, ఆలూ ధరలే కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది.

ఆర్బిఐ అధ్యయనం ప్రకారం.. టమాటా, ఉల్లి, ఆలూ ధరలు తక్కువగా ఉన్న సమయంలో కూరగాయల ద్రవ్యోల్భణం కూడా తక్కువగానే ఉందని పేర్కొంది. ఉల్లిపాయల ధరలు సెప్టెంబర్ – డిసెంబర్ మధ్యకాలంలో అత్యధికంగా పెరుగుతున్నాయని, ఆలూ ధరలు అక్టోబర్-నవంబర్ నెలల్లో గరిష్ట స్థాయికి చేరుతున్నాయని పేర్కొంది.

టమాటా ధరలు ఒక సంవత్సరం పెరిగితే, మరో సంవత్సరం తగ్గుతున్నాయని ఆర్బిఐ నివేదిక స్పష్టం చేసింది. సాధారణంగా కూరగాయల ధరలు పెరిగితే ఆహార ద్రవ్యోల్భణం పెరుగుతుందని, కూరగాయల ధరల్లోనూ ఈ మూడింటి ప్రభావమే ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టు నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు వీటి ధరల్లో సగటున 30 శాతం పెరుగుదల నమోదైనట్లు ఈ నివేదికలో పేర్కొన్నారు.