
టెక్నాలజీ ఎలా పెరుగుతుందో దానికి సమానంగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో వస్తోన్న టెక్నాలజీని ఆసరాగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టడానికి ప్రముఖ భారత బ్యాంకింగ్ సంస్థ ఎస్బీఐ ఇప్పటికే పలు సెక్యూరిటీ ఫీచర్లను జోడిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా యోనో మొబైల్ యాప్లో మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.

సైబర్ నేరగాళ్లు ఇతరుల యాప్లను యాక్సెస్ చేయడానికి అవకాశం లేకుండా.. సిమ్ బైండింగ్ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. దీంతో మీ యోనో, యోనో లైట్ యాప్లను ఇతరులు వాడకుండా చేయొచ్చు.

ఇకపై యోనో యాప్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ కచ్చితంగా మీ బ్యాంకులో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే రిజిస్టర్ చేసుకున్న సిమ్ ఏ డివైజ్లో అయితే ఉంటుందో కేవలం దానికే యోనో ఇన్స్టాల్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి రావాలంటే యూజర్లు యోనో యాప్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకునే క్రమంలో బ్యాంకులో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఆ డివైజ్లో ఉందో లేదో వెరిఫై చేసుకుంటుంది.

మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే యాప్ డౌన్లోడ్ అవుతుంది కాబట్టి.. యోనో పేరుతో జరుగుతోన్న మోసాలకు ఇకపై సులభంగా చెక్ పెట్టవచ్చని ఎస్బీఐ వర్గాలు చెబుతున్నాయి.