
ఇంట్లో చేసినప్పుడు చాలామందికి పునుకులు గట్టిగా రావడం లేదా నూనె ఎక్కువ పీల్చడం జరుగుతుంది. అయితే పప్పు రుబ్బేటప్పుడు పాటించే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో బండ్ల మీద కంటే రుచికరమైన పెసర పునుకులను ఇంట్లోనే తయారు చేయవచ్చు.

ఈ పెసర పునుకుల తయారీ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు, రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత నీళ్లన్నీ వడకట్టి, మిక్సీ జార్లో లేదా గ్రైండర్లో వేసి 2 అంగుళాల అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి వెన్నలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

గ్రైండ్ చేసేటప్పుడు లో స్పీడ్లో నిదానంగా చేయడం వల్ల పిండి ఫ్లఫ్ఫీగా వచ్చి పునుకులు మెత్తగా ఉబ్బుతాయి. గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, పావు కప్పు తాజా కొత్తిమీర తరుగు వేసి పిండిని బాగా బీట్ చేసుకోవాలి.

పిండిని ఎంత బాగా బీట్ చేస్తే పునుకులు అంత గుల్లగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె బాగా వేడెక్కనివ్వాలి. చేతులను నీటితో తడి చేసుకుంటూ పిండిని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ఉండలుగా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. పునుకులు వేసిన తర్వాత రెండు నిమిషాలు హై ఫ్లేమ్పై వేయించాలి.

అవి నూనెపై తేలిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కి మార్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసుకోవాలి. వేడి వేడిగా ఉన్న ఈ పెసర పునుకులను కమ్మటి అల్లం పచ్చడితో సర్వ్ చేస్తే అమృతంలా ఉంటాయి.