SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తన కస్టమర్లకు షాకిచ్చింది. మరోసారి రుణ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 10 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఈ రుణ రేట్ల పెంపు మే 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది.
రెండు నెలల కాలంలో చూస్తే బ్యాంకు రుణ రేట్లు పెంచడం ఇది రెండోసారి. తాజాగా 10 బేసిస్ పాయింట్ల రేట్ల పెంపు వల్ల ఓవర్ నైట్, నెలరోజుల ఎంసీఎల్ఆర్, మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.85 శాతానికి చేరింది. ఇదివరకు ఈ ఎంసీఎల్ఆర్ రేటు 6.75 శాతం ఉంది. అలాగే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.15 శాతానికి చేరింది.
ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.2 శాతానికి పెరిగింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.4 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.5 శాతానికి ఎగబాకింది. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును పెంచిన పది రోజుల తర్వాత బ్యాంకు రుణ రేట్లను పెంచింది. ఇప్పుడు రెపో రేటు 4.4 శాతం ఉంది.
బ్యాంకులు, ఇతర ఆర్థిక సంవస్థలు MCLR రేటు ప్రాతిపదికన రుణాలను అందిస్తుంటాయి. బ్యాంకు, లెండర్కు ఎంసీఎల్ఆర్ అనేది ఇంటర్నల్ బెంచ్మార్క్. ఈ ఎంసీఎల్ఆర్ రేటును బట్టే రుణాలకు రేట్లను నిర్ణయిస్తాయి బ్యాంకులు. ఎస్బీఐ తన బల్క్ టర్మ్ డిపాజిట్లపై (రూ.2కోట్లు, అంతకంటే ఎక్కువ) వడ్డీ రేటును మే 10 నుంచి 40-90 బేసిస్ పాయింట్లు పెంచింది.