
టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ను కలిశారు. పుష్పగుచ్ఛంతో ఆహ్వానించిన జగన్.. ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు.

ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన ఈ మాజీ బౌలర్ ఓ గిఫ్ట్ ను కూడా జగన్ కు అందించారు. ఈ గిఫ్ట్ లో అనిల్ కుంబ్లే కెరీర్ లో 10 మైలురాళ్లను ఓ ఫొటోలో పొందుపరిచి, వాటి వివరాలను కూడా ఫ్రేమ్ చేసి జగన్ కు అందించాడు.

అలాగే సీఎం జగన్ కూడా అనిల్ కుంబ్లేను శాలువాతో సత్కరించి, తిరుమల తిరుపతి శ్రీనివాసుడి విగ్రహాన్ని బహూకరించారు.

ఈ మాజీ వెటరన్ క్రికెటర్ టీమిండియా తరపున 18 సంవత్సరాలపాటు తన సేవలు అందించాడు. బౌలర్, కెప్టెన్, కోచ్ లాంటి ఎన్నో రకాలుగా తన విలువైన సేవలు అందించాడు. ఎన్నో రికార్డును నెలకొల్పి భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో 619 వికెట్లు తీసిన ఈ అగ్రశ్రేణి బౌలర్.. వన్డేల్లో 337 వికెట్లు తీసి తన సత్తా చాటాడు.