ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం జనవరి 2024లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆలయ ట్రస్ట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ సహా దేశ విదేశాల్లోని ప్రముఖులు, సన్యాసులు, స్వాములకు ఇప్పటికే ఆహ్వానాలు పంపించింది.
రామ మందిర నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో తెలియజేస్తూ వీడియోలు, ఫోటోలను రిలీజ్ చేస్తూనే ఉంది ట్రస్ట్ బోర్డు. తాజాగా ఆలయంలోపల నిర్మాణం.. గోడలు మీద చెక్కిన శిల్పాలకు చెందిన ఫోటోలను శ్రీ రామ జన్మ భూమి ట్రస్ట్ షేర్ చేసింది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి చెందిన ట్రస్ట్ అధికారిక Xఖాతాలో షేర్ చేసిన రామ మందిరం ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ చిత్రాల్లో రామమందిరం లోపల స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఎంతో అందంగా ఉండి కనులకు విందు చేస్తున్నాయి.
రామయ్య కొలువుదీరే ఈ రామమందిర నిర్మాణానికి రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన గ్రానైట్ రాళ్లను వినియోగిస్తున్నారు.
గత మూడు రోజుల క్రితం రామమందిరం వీడియోను షేర్ చేసిన ట్రస్టు "500 ఏళ్ల పోరాటానికి పరాకాష్ట" అనే క్యాప్షన్తో .. అయోధ్య పిలుస్తుంది రండి అనే విధంగా ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరుని చూపించింది.
రామయ్య కొలువుదీరే గర్భాలయంలో నిర్మాణం ఆలయ స్థంబాలు, గోడలపై శిల్పాలు పురాణాల గాథలను తెలిపే విధంగా ఎలా మలచబడుతున్నాయో చెప్పకనే చెప్పేసింది ఈ వీడియో ద్వారా..