
బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజైన శుక్రవారం రాత్రి శ్రీమలయప్పస్వామి తనకెంతో ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై లక్ష్మీకాసుల మాల ధరించి తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తకోటికి దర్శనమిచ్చారు.

ఏనుగులు, అశ్వాలు ఠీవీగా ముందు వెళ్తుండగా.. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. గ్యాలరీల్లోనే రెండు లక్షల మంది భక్తులు ఉండగా, వెలుపల కూడా పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు

తుమ్మలగుంట క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. వివిద రకాల ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కోలాహలంగా సాగింది. గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి.

భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. లక్షలాది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. ఉదయం నుంచే విపరీతమైన భక్తుల రద్దీ నెలకొంది.

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏడాది మొత్తంలో గరుడోత్సవం రోజు మాత్రమే గర్భాలయంనుంచి బయటకు తీసుకొని వచ్చే మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో అలంకరించారు. వీటిని చూసి భక్తులు తరలించారు.

గరుడ సేవలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి గరుడ వాహన సేవలో పాల్గొన్నారు. మరోవైపు గరుడ సేవలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి గరుడ సేవ తిలకించేలా ఏర్పాట్లు చేశారు.

ఇక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఇవాళ ఉదయం 7 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారు.