
మొదటి రోజు, కుంకుమ రంగు లేదా నారింజ రంగు: నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఈ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. నారింజ రంగు శైలపుత్రికి ఇష్టమైన రంగు. ఈ రోజున మీరు నారింజ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించవచ్చు. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే నారింజ రంగు శక్తి, ఆనందాన్ని ఇస్తుంది. సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.

రెండవ రోజు, తెలుపు రంగు: నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజున అమ్మవారిని బ్రహ్మచారిణినిగా పూజిస్తారు. ఈ రోజు తెల్లటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు. ఎందుకంటే బ్రహ్మచారిణి దేవికి తెలుపు రంగు చాలా ఇష్టం. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. తెలుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

మూడవ రోజు, ఎరుపు: నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజున చంద్రఘంట దేవిని పూజిస్తారు. ఈ రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించడం మంచిదని చెబుతారు. ఎరుపు జగన్మాతకు ఇష్టమైన రంగుగా పరిగణించబడుతుంది. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే ఎరుపు బలం, ప్రేమకు చిహ్నం.

నాల్గవ రోజు, ముదురు నీలం రంగు: దుర్గాదేవి నవరాత్రుల్లో నాల్గవ రోజున దుర్గాదేవి తొమ్మిది అవతారాలలో ఒకటైన కూష్మాండ దేవిని పూజిస్తారు. కూష్మాండ దేవికి ఇష్టమైన రంగు ముదురు నీలం. ఈ రోజు ముదురు నీలం రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదం. ముదురు నీలం రంగు మంచి ఆరోగ్యం, శ్రేయస్సును సూచిస్తుంది.

ఐదవ రోజు: పసుపు: శరన్నవరాత్రులలో ఐదవ రోజున స్కంద దేవిని పూజిస్తారు. అలాగే ఈ ఐదవ రోజున అమ్మవారిని పసుపురంగు చీరతో అలంకరిస్తారు. పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తే శుభం కలుగుతుందని నమ్మకం. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే పసుపు ఆనందం, ఉత్సాహం, సానుకూలతను సూచిస్తుంది. అంతేకాదు పసుపు రంగు అదృష్టానికి సంకేతం.

ఆరవ రోజు, ఆకుపచ్చ రంగు: నవరాత్రులలో ఆరవ రోజున కాత్యాయినీ దేవిని పూజిస్తారు. ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం శుభప్రదమని చెబుతారు. ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే ఆకుపచ్చ కొత్త ప్రారంభాలు, సమృద్ధి, శ్రేయస్సుకి చిహ్నం.

ఏడవ రోజు గ్రే కలర్ దుస్తులు: ఈ రోజున అమ్మవారి తొమ్మిది అవతారాలలో ఒకటైన కాళరాత్రిని పూజిస్తారు. అన్ని రకాల ప్రతికూల శక్తి, దుష్టశక్తులను నాశనం చేయడానికి కాళరాత్రిని పూజిస్తారు. ఈ రోజున జగన్మాతను బూడిదరంగు వస్త్రాలు ధరించి పూజించడం శుభప్రదమని చెబుతారు. ఈ రంగు ప్రాముఖ్యత ఏమిటంటే బూడిద రంగు భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది.

ఎనిమిదో రోజు ఊదా రంగు: నవరాత్రులలో ఎనిమిదవ రోజున మహాగౌరీని పూజిస్తారు. మహాగౌరీని పూజించడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. మహాగౌరికి ఇష్టమైన రంగు ఊదా. ఈ రంగు సంపద, శ్రేయస్సును సూచిస్తుంది.

తొమ్మిదో రోజు నెమలి ఆకుపచ్చ రంగు: నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదవ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. ఈ రోజున నెమలి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం శుభప్రదమని చెబుతారు. ఈ రంగు ప్రాముఖ్యతను చూస్తే కరుణకు చిహ్నం.