
మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనేది ఆనవాయితీ. పూర్వకాలం నుంచే మృగశిర కార్తె రోజు చేపలు తినడం చేస్తుంటారు. ప్రతి పల్లె పట్నంలో ప్రతి ఇంటిలో చేపలకూర గుమ గుమలతో వీధి మొత్తం సందడిగా ఉంటుంది. ఈరోజు చేపలు తినడమే కాకుండా, కొంత మంది ఆస్తమా, ఉబ్బసం తగ్గడం కోసం చేప ప్రసాదం కూడా తీసుకుంటారు. మరి ఈ రోజు చేప మందు, చేపలకు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే?

మృగశిర కార్తె కంటే ముందు రోహిణి కార్తె ఉంటుంది. ఇక రోహిణి కార్తె అంటే రోకళ్లు కూడా పగిలేంత ఎండలు ఉంటాయి. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుంటారు. శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత వెంటనే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆకాశం నిండా నైరుతి రుతుపవనాలు మేఘావృతమై తొలకరి చినుకులు పడతాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.

వేడి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో మానవ శరీరంలో దాని అంత త్వరగా అలవాటు పడదు. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతే కాకుండా వాతావరణం తేమగా ఉండటం వలన బ్యాక్టీరియా పెరుగుతుంది, వైరస్లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అందుకే ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకొని, జలుబు, దగ్గు, ఆస్తమా, వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి చేపల తింటారు.

అంతే కాకుండా శరీరంలో వేడి ఉండటానికి చేపలు తింటారు. ఇక ఈ చేపల్లో అనేక పోషకాలు , విటమిన్స్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ వాతావరణం మారే సమయంలో చేపలు తినడం వలన ఇది శరీరంలో వేడిని పెంచి, కఫం పెరగకుండా చేస్తుంది. అంతే కాకుండా గుండె , ఊపిరితిత్తులకు తగిన వేడిని అందజేస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఈ రోజున చేపలు తింటారు అని చెబుతున్నారు నిపుణులు.

ముఖ్యంగా మృగశిర అంటే వానలు మొదలు, ఈ సమయంలో చల్లటి వాతావరణం వలన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ సమయంలో చేపలు తినడం వలన అది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అంతే కాకుండా, వాత కఫ దోషాలు పెరుగుతాయి. తొలి వాన పడగానే రైతులు పొలం పనులు ప్రారంభిస్తారు, ఆ సమయంలో ఓళ్లు నొప్పుల వంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ రోజు చేపలు తినడం వలన ఒళ్లు నొప్పులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావని, రైతులు మృగశిర కార్తె రోజు చేపలు తింటారు. మృగశిరన చేప తింటే ఏడాదంతా ఏ రోగం రాదు.. అని సామెత ఉంది. అందుకే చాలా మంది ఈ రోజున చేపలు తినడానికి ఆసక్తి చూపుతారు.