
ఏలూరు: ఒక రూపాన్ని అనంతంగా చూస్తే ఎంత మంత్ర ముగ్దులు అవుతామో అదే రూపాన్ని సూక్ష్మంగా చూస్తే ఆశ్చర్య పోవటం తప్పదు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే అదే విగ్రహాన్ని సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ లిడ్పై చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచం ఎంత వేగంగా ఆధునిక సాంకేతికత వైపు పరుగులు తీస్తున్నా… చేతివృత్తి కళలకు ఉన్న ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. ముఖ్యంగా సూక్ష్మ కళారూపాలు అంటే చిన్న పరిమాణంలో అద్భుతమైన భావాలను ప్రతిబింబించే కళ. కంటికి కనిపించడానికి కూడా కష్టంగా ఉండే వస్తువులపై అద్భుత శిల్పాలను చెక్కడం సూక్ష్మ కళాకారుల ప్రతిభకు నిదర్శనం.

అలాంటి అరుదైన కళల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం రుస్తుంబాధకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన కళా ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు.

హనుమాన్ జయంతి సందర్భంగా పెన్సిల్ లిడ్పై హనుమంతుని ప్రతిమను సూక్ష్మ రూపంలో రూపొందించి భక్తి భావాన్ని కళతో మేళవించారు. ఎటువంటి ప్రత్యేక సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా కేవలం రెండు గంటల వ్యవధిలో ఈ ప్రతిమను చెక్కడం విశేషం. ఈ కళాఖండం పొడవు 12 మిల్లీమీటర్లు, వెడల్పు 8 మిల్లీమీటర్లుగా ఉండగా, చిన్న పెన్సిల్ లీడ్పై హనుమంతుని ఆకృతిని స్పష్టంగా తీర్చిదిద్దడం చూసిన వారిని అబ్బురపరుస్తోంది. ఇంత చిన్న పరిమాణంలో కళను ఆవిష్కరించడానికి అపారమైన ఓపిక, ఏకాగ్రత, నైపుణ్యం అవసరమని కళాభిమానులు చెబుతున్నారు.

సూక్ష్మ కళారూపాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు… భారతీయ సాంప్రదాయ కళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా కూడా నిలుస్తున్నాయి. పెన్సిల్ లిడ్, బియ్యం గింజలు, చాక్పీస్ మొనలు వంటి సూక్ష్మ వస్తువులపై కళాఖండాలు రూపొందించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఒక చిన్న పొరపాటు జరిగినా మొత్తం కళాఖండం దెబ్బతినే అవకాశం ఉంటుంది.

ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన విజయ మోహన్, తన సూక్ష్మ కళా ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా రూపొందించిన ఈ ప్రత్యేక కళాఖండం భక్తి, సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ అద్భుత కళాఖండాన్ని చూసిన స్థానికులు, కళాభిమానులు, యువ కళాకారులు విజయ మోహన్ ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు.