
దేవతల భూమిగా పేరుగాంచిన ఉత్తరాఖండ్ రాష్ట్రం.. అనేక పవిత్రక్షేత్రాలు, ఇతిహాసాలు, ఆధ్యాత్మిక సంపదకు నిలయం. ఈ పవిత్ర భూమిలోని ప్రసిద్ధ క్షేత్రాలలో ఒకటి జగేశ్వర్ ధామ్ (Jageshwar Dham). అల్మోరా పట్టణం నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలోని కుబేర ఆలయం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది. రావణుడి సవతి సోదరుడు, సంపదకు అధిపతి అయిన కుబేరుడికి అంకితమైన ఈ ఆలయం సుమారు 9వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తారు. ఇక్కడ కుబేరుడు ఏకముఖ శివలింగంలో శక్తి రూపంగా పూజించబడుతున్నాడని విశ్వసిస్తారు. భక్తులు ఆయన ఆశీర్వాదాలు ఆర్థిక ఇబ్బందులను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయని గాఢంగా నమ్ముతారు. అందుకే ప్రతి నెలా వేలాది మంది యాత్రికులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.

విశిష్ట ఆచారాలు – నైవేద్యాల విశ్వాసం.. అప్పులు, వ్యాపార నష్టాలు లేదా కుటుంబ ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు భక్తులు కుబేరుని ఆశ్రయిస్తారు. తమ కోరికలు నెరవేరిన తర్వాత, కృతజ్ఞతగా పసుపు రంగు వస్త్రాలు, ఖీర్ (పాల పాయసం) సమర్పించడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. కొందరు భక్తులు పూజ అనంతరం బంగారం లేదా వెండి నాణేలను తీసుకుని ఇంట్లో శ్రేయస్సుకు చిహ్నంగా ఉంచుకుంటారు. ఆలయ పూజారి రమేష్ భట్ మాటల్లో.. కుబేరుడు ఇక్కడ శక్తి స్వరూపంగా నివసిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఎంతో మంది భక్తులు తమ సమస్యల నుండి ఉపశమనం పొందిన అనుభవాలను పంచుకుంటున్నారు.

ఎలా చేరుకోవాలి?.. జగేశ్వర్ ధామ్.. అల్మోరా నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్ కథ్గోడమ్ రైల్వే స్టేషన్ (Kathgodam railway station). ఇక్కడ్నుంచి నుంచి రోడ్డు మార్గంలో అల్మోరా చేరుకుని, అక్కడి నుంచి బస్సులు లేదా టాక్సీల ద్వారా జగేశ్వర్ చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం పంత్నగర్ ఎయిర్ పోర్ట్ (Pantnagar Airport). ఇది దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైన్ అడవులు, పర్వత లోయల మధ్యుగా సాగిన ఈ ప్రయాణం ఆధ్యాత్మిక అనుభూతిని మరింత ఆహ్లాదంగా చేస్తుంది.

ఆధ్యాత్మిక శాంతి – ఐశ్వర్యానికి ఆశాకిరణం.. జగేశ్వర్ ధామ్ ప్రధానంగా శివుడికి అంకితమైన పురాతన దేవాలయ సముదాయంగా ప్రసిద్ధి చెందింది. అయితే కుబేర ఆలయం ఈ క్షేత్రానికి మరో ప్రత్యేకతను అందిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, చల్లని పర్వత గాలి, పక్షుల కిలకిలారావాలు భక్తులకు దైవానుభూతిని కలిగిస్తాయి.

జగేశ్వర్ ధామ్లోని కుబేర ఆలయం కేవలం ఒక పుణ్యస్థలం మాత్రమే కాదు.. ఆర్థిక ఇబ్బందులతో పోరాడుతున్న వారికి ఆశాకిరణం. విశ్వాసంతో చేసిన ప్రార్థనలు, కృతజ్ఞతగా సమర్పించే పాయసం, పసుపు వస్త్రాలు భక్తుల భక్తిని ప్రతిబింబిస్తాయి. ఈ పవిత్ర స్థలం విశ్వాసాన్ని బలోపేతం చేస్తూ దేశం నలుమూలల నుంచి యాత్రికులను ఆకర్షిస్తూనే ఉంది. మీరూ ఒకసారి దర్శించి సానుకూల ఫలితాలను పొందండి. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)