
యాగంటి క్షేత్రం ఒక శైవ క్షేత్రం. ఉమామహేశ్వర స్వామి ప్రధాన దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపిస్తారు.

యాగంటి క్షేత్రంలో ప్రకృతి అందాలు భక్తులను అలరిస్తాయి. శిల్పి చెక్కినట్టుగా పర్వతాలు నిట్టనిలువుగా వుండి కనువిందు చేస్తాయి. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు ఆకర్షిస్తాయి.

అయితే యాగంటి వైష్ణవ క్షేత్రం అవ్వాల్సింది.. ఇపుడు శైవ క్షేత్రంగా మారడం వెనుక ఓ కథ ఉంది. మొదట యాగంటిలో వేంకటేశ్వర స్వామిని ప్రతిష్టించాలని అనుకున్నారట. అయితే స్వామి వారి విగ్రహం కాలిలో లోపం కనిపించడంతో ఆ విగ్రహాన్ని ప్రతిష్టించలేదట. దీంతో అప్పుడు స్వయంభూవుగా వెలసిన ఉమామహేశ్వర లింగాన్ని దేవాలయంలో ప్రతిష్ఠించారట. దీంతో వైష్ణవ క్షేత్రం కావలసిన యాగంటి శైవ క్షేత్రంగా మారిందట.

యాగంటి ఉమామహేశ్వరాలయంలోని పుష్కరిణికి 'అగస్త్య పుష్కరిణి' అనే పేరు. మునీశ్వరుడైన అగస్త్యుడు ఈ కోనేరులో స్నానం చేశాడని, అందుకే ఈ కోనేరుకు ఆ పేరు వచ్చిందని స్థలపురాణం. ఈ పుష్కరిణిలోకి నీరు అక్కడున్న ఓ నంది నోటి నుండి వస్తూ వుంటుంది. ఈ పుష్కరిణిలో నీటికి ఔషధ గుణాలు వున్నాయని భక్తుల నమ్మకం

ఈ క్షేత్రంలో ఉన్న ఒక గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని, శిష్యులకు కాలజ్ఞానం చెప్పారని అంటారు. ఆ గుహను శంకర గుహ, రోకళ్ళ గుహ అని పిలుస్తారు

ఈ క్షేత్రంలో కూడా కాకులు కనిపించవు. ఇక్కడ అగస్త్యుడి తపస్సు చేస్తున్న సమయంలో అక్కడ చేరిన కొన్ని కాకులు అరిచి అగస్త్యుడికి తపోభంగాన్ని కలిగించాయట. అప్పుడు అగస్త్యుడు ఈ క్షేత్రంలో కాకులకు ప్రవేశం లేదని శపించారట. దీంతో అప్పటి నుంచి ఇక్కడ కాకులు కనిపించవట.

కర్నూలుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న యాగంటి బస్సు సౌకర్యం ఉంది. కర్నూలు, బనగానపల్లి, నంద్యాల నుంచి యాగంటికి బస్సు సౌకర్యం వుంటుంది.