ఉత్తరాఖండ్లో ఉన్న చార్ ధామ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా.. పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఈ చార్ ధామ్ లో ఏ ప్రదేశాలను సందర్శిస్తారు ఏ దైవాన్ని పూజిస్తారు తెలుసుకోవాలి. దీనితో పాటు ఈ చార్ధామ్ యాత్రలో మొదట ఏ ధామ్ను సందర్శించాలి,. వాటి ప్రాముఖ్యత గురించి ఈ రోజు తెలుసుకుందాం..
చార్ ధామ్ ఆధ్యాత్మిక పర్యటన యమునోత్రి నుంచి ప్రారంభమవుతుంది. యమునోత్రి ధామ్లో యమునా దేవిని పూజిస్తారు. ఈ ఆలయంలో యమునా దేవి పాలరాతి విగ్రహం ఉంది. అందంగా కనిపించే యమునాదేవిని ఎంత చూసినా తనివి తీరదు. ఈ ధామ్ చేరుకోవడానికి భక్తులు 6 కి.మీ.లు కాలినడకన వెళ్లాలి. యమునా ధామ్తో పాటు సూర్య కుండ్, సప్తరిషి కుండ్, హాట్ బాత్ కుండ్, ఖర్సాలీలోని శనీశ్వర దేవాలయం కూడా చాలా ప్రసిద్ధి చెందినవి.
చార్ ధామ్ యాత్రలో యమునోత్రి తర్వాత గంగోత్రి రెండవ స్టాప్. గంగోత్రి ధామ్లో గంగాదేవిని పూజిస్తారు. ఈ ధామ్ పాలరాతితో తయారు చేయబడింది. దీని నిర్మాణం చాలా ఆకర్షణీయంగా,ఆకట్టుకుంటుంది. గంగాదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయంతో పాటు, గంగోత్రిలో సందర్శించదగిన అనేక ఇతర ప్రదేశాలు ఉన్నాయి. వీటిల్లో ప్రధానమైనవి మనేరి, కాళింది ఖల్ ట్రెక్, గౌముఖ్, నీటిలో ఉన్న శివలింగం, హర్షిల్, దయారా బుగ్యాల్, పంతిని పాస్ ట్రెక్.
హిందూ మతంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ధామ్.. చార్ ధామ్ యాత్రలోని మూడవ గమ్య స్థానం. కేదార్నాథ్ ధామ్లో లయకారుడైన శివుడిని పూజిస్తారు. ఈ ధామ్ని పాండవులు నిర్మించారని చెబుతారు. అనంతరం ఆదిగురు శంకరాచార్యులు దాని పునరుద్ధరణ పనిని పూర్తి చేశారు. కేదార్నాథ్ ధామ్ను సందర్శించకుండా బద్రీనాథ్ ధామ్ను ఎవరు సందర్శిస్తారో.. వారి ప్రయాణం అసంపూర్తిగా ఉంటుంది. అంటే ఫలించదని నమ్మకం.
చార్ ధామ్ యాత్రలో చివరి గమ్య స్థానం బద్రీనాథ్ ధామ్. ఈ చార్ ధామ్ ఆధ్యాత్మిక పర్యటన బద్రీనాథ్ కు చేరుకున్న తర్వాత మాత్రమే ముగుస్తుంది. బద్రీనాథ్ ధామ్లో ప్రపంచాన్ని పోషించే విష్ణువును పూజిస్తారు. ఈ ధామ్లో విష్ణువు స్వయంభువుగా వెలసిన శాలిగ్రామ విగ్రహం భక్తులతో పూజలను అందుకుంటుంది. సత్యయుగ కాలంలో శ్రీ మహా విష్ణువు ఈ ప్రదేశంలో సత్యనారయణ రూపంలో తపస్సు చేశాడని ప్రతీతి.
ఈ చార్ ధామ్ యాత్రకు హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. చార్ధామ్ను సందర్శించిన వ్యక్తి మోక్షాన్ని పొందుతాడని మత విశ్వాసం. ప్రతి హిందూ తన జీవితకాలంలో ఒకసారైనా చార్ ధామ్ యాత్రను చేయాలని కోరుకుంటారు. తెలిసి తెలియక చేసిన పాపాలు కడిగివేయబడతాయని నమ్మకం. అందుకే హిందూ మతంలో చార్ ధామ్ యాత్రకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.