
పెరుగులో ఉప్పు కలిపితే ఏమవుతుంది?: చాలా మంది పెరుగులో ఉప్పు వేసుకుని తినడానికి ఇష్టపడతారు. అయితే, పెరుగులో సాధారణ టేబుల్ సాల్ట్ (ఉప్పు) కలపడం వల్ల అందులో సహజంగా ఉండే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియాపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థకు ఎంతో అవసరం. ఉప్పు కారణంగా ఈ బ్యాక్టీరియా నశిస్తే, పెరుగులోని ప్రోబయోటిక్ విలువలు, పోషకాలు చాలా వరకు తగ్గిపోతాయి.

పెరుగును ఉప్పుతోనే తినాలనుకుంటే సాధారణ ఉప్పుకు బదులుగా కొద్ది మోతాదులో నల్ల ఉప్పు (Black Salt) లేదా సైంధవ లవణాన్ని (Rock Salt) వాడటం మంచిది. అధిక రక్తపోటు (High BP) సమస్యతో బాధపడేవారు పెరుగులో ఉప్పు వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే, ఇది వారి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

పెరుగులో చక్కెర కలిపితే ఏమవుతుంది?: మరోవైపు, పెరుగులో చక్కెర లేదా పంచదార కలిపి తినడం కూడా ఒక అలవాటు. చక్కెర వల్ల పెరుగులోని మంచి బ్యాక్టీరియా నశించదు. కాబట్టి, ఇది పేగు ఆరోగ్యానికి అలాగే జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది. తీపి పెరుగు కడుపులో మంట లేదా చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు లేదా ఊబకాయంతో బాధపడేవారు చక్కెర పెరుగును నివారించాలి. ఎందుకంటే, ఇది శరీరానికి అధిక క్యాలరీలను ఇచ్చి బరువు పెరిగేలా చేస్తుంది. అలాగే, మధుమేహం ఉన్న రోగులు చక్కెర కలిపిన పెరుగును అస్సలు తినకూడదు, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది.

పెరుగును ఎలా తీసుకోవాలనేది మీ శరీర ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. మీరు గనుక డయాబెటిస్, అధిక రక్తపోటు లేదా ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతుంటే, నిపుణులు లేదా వైద్యుల సలహా మేరకు మాత్రమే పెరుగులో ఉప్పు లేదా చక్కెరను చేర్చుకోవడం ఉత్తమం.