
కావలసిన పదార్థాలు: 1 చిన్న టీ కప్పు కందిపప్పు, 1-2 స్పూన్ల నూనె, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, పావు టీస్పూన్ మెంతులు, చేత్తో నలిపిన అర టీస్పూన్, మీ కారానికి తగినట్లుగా 10 నుండి 11 గింజలు తీసిన ఎండుమిరపకాయలు, కచ్చాపచ్చాగా దంచిన 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు రెమ్మల కరివేపాకు, సగం - పెద్ద ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ, 4 నుండి 5 - బాగా పండిన ఎర్రటి టమోటాలు, అర టీస్పూన్ పసుపు, నిమ్మకాయ సైజులో సగం నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు మరియు తాజా కొత్తిమీర తరుగు.

తయారీ విధానం: కుక్కర్లో ఒకటి నుండి రెండు స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, పావు స్పూన్ మెంతులు వేయాలి. అందులోనే చేత్తో నలిపిన ధనియాలు వేయాలి. ఇలా ధనియాలు నలపడం వల్ల పప్పుతో పాటు మెత్తగా ఉడికి మంచి సువాసన వస్తుంది. ఆ తర్వాత 10-11 ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చిన్న మంటపై మాడకుండా దోరగా వేయించాలి. పోపు మంచి సువాసన వచ్చాక తాజా కరివేపాకు వేయాలి.

ఇందులోనే ఒక కప్పు కందిపప్పు వేసి లో ఫ్లేమ్లో కందిపప్పు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత పెద్దగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు గుజ్జున్న ఎర్రటి టమోటా ముక్కలు, అర టీస్పూన్ పసుపు వేసి ఒక్క నిమిషం పాటు కలపాలి.

ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసి కలపాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై సరిగ్గా 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆవిరి పూర్తిగా పోయాక మూత తీసి, పప్పుగుత్తితో పప్పును మెత్తగా మెదుపుకోవాలి.

మెదిపిన పప్పులో నానబెట్టిన చింతపండు రసం మరియు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. టమోటాలు, చింతపండు పులుపుకు సరిపడా ఉప్పు, కారాలు సరిపోయాయో లేదో చూసుకోవాలి. మీడియం మంటపై పప్పును 2-3 నిమిషాలు కుతకుతా ఉడకనిచ్చి, చివరగా దండిగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ కట్టేయాలి. అంతే, నోరూరించే రాయలసీమ స్టైల్ ఎండుమిరపకాయల పప్పు సిద్ధం! వేడివేడి రాగి సంగటి లేదా అన్నంతో నెయ్యి కలిపి తింటే ప్రతి ముద్ద అమృతంలా అనిపిస్తుంది!