
తెలంగాణలో రాబోయే ఎన్నికలు.. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలకు అన్యాయం చేశాయని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సీఎం చేస్తుందని హామీ ఇచ్చారు. గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొన్న అమిత్షా కాంగ్రెస్, బీఆర్ఎస్పై విమర్శలు చేశారు.

ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని, గద్వాలలో పేదలకు 500 ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదని అమిత్ షా అన్నారు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారన్నారు. అబద్ధపు మాటలతో కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారన్న ఆయన తెలంగాణలో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

మోసాలు, అబద్ధాల్లో కేసీఆర్ వరల్డ్ రికార్డు కొట్టారని అమిత్ షా ఆరోపించారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే టైమ్ వచ్చిందని, మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ భవిష్యత్ బాగుంటుందన్నారు అమిత్ షా.

బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని గద్వాల్ సభా వేదికగా హామీ ఇచ్చారు అమిత్షా. కేసీఆర్ కారు స్టీరింగ్ ...ఓవైసీ చేతిలో ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వెనకుండి నడిపిస్తున్నది ఎంఐఎం పార్టీయే అని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం... ఈ మూడు పార్టీలూ ఒక్కటే అన్నారు. బీఆర్ఎస్ 2జీ... ఎంఐఎం 3జీ... కాంగ్రెస్ 4జీ లాంటి పార్టీలన్నారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఉచిత అయోధ్య రామాలయ తీర్థయాత్ర అవకాశాన్ని ప్రజలకు కల్పిస్తామన్నారు.
