కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడి దర్శించుకుని ఆశీస్సులు పొందారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఉన్న నరేంద్ర మోడీ నిన్న రాత్రి తిరుమల చేరుకొని ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో తిరుపతి తిరుమల లో అధికార యంత్రాంగం
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయగా నిఘా వర్గాల కనుసన్నల్లో భద్రత కొనసాగింది. తిరుమల ఆలయ మహద్వారం వద్ద ప్రధాని నరేంద్ర మోడీకి టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ కి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనాలు అందించారు అర్చకులు.
శ్రీవారి పట్టువస్త్రంతో ప్రధానిని సత్కరించి, తీర్థప్రసాదాలను టీటీడీ చైర్మన్ భూమన, ఈఓ ధర్మారెడ్డి అందచేసారు. శ్రీవారి చిత్రపటం, 2024 టీటీడీ క్యాలెండర్, డైరీలను మోదీకి అందజేసారు. షెడ్యూల్ సమయం కంటే అర్థగంట ముందే శ్రీవారిని దర్శించుకొని అతిధిగృహం చేరుకున్న మోదీ
9.30 గంటలకు తిరుమల నుండి తిరుపతి ఎయిర్పోర్ట్ కు బయలుదేరారు. తిరుపతి, తిరుమల పర్యటన ముగించుకొని బయలుదేరారు ప్రధాని నరేంద్ర మోడీ.
రోడ్డు మార్గంలో రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకునున్న ప్రధాని నరేంద్ర మోడీ 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరిగి తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. రేణుగుంట విమానాశ్రయంలో ప్రధానికి గవర్నర్ అబ్దుల్ మజీర్ తోపాటు జిల్లా మంత్రులు, అధికార యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికింది.