
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జీ–20 సన్నాహక సమావేశం జరిగింది. ఈ ఈ సమావేశానికి దాదాపుగా 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు.

భారత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది అంటే 2023 సెప్టెంబర్లో జరగనున్న జీ–20 సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, వ్యూహాలపై సలహాలు, సూచనలను 40 రాజకీయ పార్టీలకు చెందిన అధినేతల నుంచి స్వీకరించారు.

భారత్ G20 ప్రెసిడెన్సీ మొత్తం దేశానికి చెందినదని, భారత్ బలాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇది ఒక విశిష్ట అవకాశం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతదేశం పట్ల ప్రపంచవ్యాప్త ఉత్సుకత, ఆకర్షణ ఉందని, ఇది భారత్ G20 ప్రెసిడెన్సీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని ప్రధాన మంత్రి ప్రకటించారు.

ఈ మేరకు ప్రధాన మంత్రి మాట్లాడుతూ, జట్టు కృషి ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. వివిధ G20 ఈవెంట్ల నిర్వహణలో నాయకులందరి సహకారాన్ని కోరారు.

భారత్ G20 ప్రెసిడెన్సీ సమయంలో పెద్ద సంఖ్యలో దేశానికి వచ్చే సందర్శకులను హైలైట్ చేస్తూ, G20 సమావేశాలు నిర్వహించే వేదికల యొక్క క పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థలను పెంచడానికి గల అవకాశాలను ప్రధాన మంత్రి వివరించారు.

ఈ సమావేశంలో మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, జెపి నడ్డా, మల్లికార్జున్ ఖర్గే, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, జగన్ మోహన్ రెడ్డి, సీతారాం ఏచూరి, చంద్రబాబు నాయుడు, ఎంకే స్టాలిన్, ఎడప్పాడి కె. పళనిస్వామి, పశుపతినాథ్ పరాస్, ఏక్నాథ్ షిండే, కెఎమ్ కాదర్ మొహిదీన్ సహా వివిధ రాజకీయ నాయకులు భారతదేశ జీ20 అధ్యక్ష పదవిపై తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.

అలాగే జీ20 ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలతో కూడిన వివరణాత్మక ప్రదర్శన కూడా అందించారు.

ఈ సమావేశానికి హాజరైన వారిలో మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, డా. ఎస్. జైశంకర్, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, శ్రీ భూపేందర్ యాదవ్ ఉన్నారు.