
ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. నిన్న రాత్రి తిరుమలోని గాయత్రి గెస్ట్ హౌజ్ లో బస చేశారు

ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు. తనతోపాటు సతీమణి భువనేశ్వరి, నారాలోకేష్ దంపతులు దేవాన్ష్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ముందుగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆలయ ముఖద్వారం వద్ద వేదపండితులు సదరస్వాగతం పలికారు. ప్రధానఅర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులను ధ్వజస్తంభ మండపం నుంచి ప్రత్యేక మార్గంగుండా ఆలయంలోనికి పిలుచుకుని వెళ్లారు.

తదనంతరం స్వామివారి అంతరాలయంలో కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.

రంగనాయక మండపంలో మలయప్ప స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలతో వేదపండితుల ఆశీర్వచనం అందజేశారు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ కు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు టీటీడీ అధికారులు.

చివరగా స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ ఫోటోను కుటుంబసభ్యులు అందరూ కలిసి అందుకున్నారు.

శ్రీవారి ఫోటోతో పాటు పద్మావతీ అమ్మవారి చిత్రపటాన్ని కూడా బహుకరించారు ఆలయ అధికారులు, అర్చకులు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులు నేరుగా బసచేసిన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.